Jasprit Bumrah: బుమ్రా తొలి వికెట్‌.. వందో వికెట్‌ ఒకేలా.. 

7 Sep, 2021 08:04 IST|Sakshi

లండన్‌: టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ ఓలీ పోప్‌ను ఔట్‌ చేయడం ద్వారా వంద వికెట్ల మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 24 టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న బుమ్రా జడేజాతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఓవరాల్‌గా బుమ్రా టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల క్లబ్‌లో చేరిన జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ 18 టెస్టుల్లోనే 100 వికెట్ల మార్క్‌ను చేరుకొని ఓవరాల్‌గా మూడో స్థానంలో.. టీమిండియా తరపున తొలి స్థానంలో ఉన్నాడు.

చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా ఘన విజయం


అయితే బుమ్రా తన తొలి టెస్టు వికెట్‌ను ఎలా దక్కించుకున్నాడో.. సరిగ్గా వందో వికెట్‌ కూడా దాదాపు అలాగే పొందడం చర్చనీయాంశంగా మారింది. ఇక బుమ్రా తన తొలి వికెట్‌ను కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఏబీ డివిలియర్స్‌ రూపంలో అందుకున్నాడు. బుమ్రా డెలివరీని ఏబీ డివిలియర్స్‌ ఆడే క్రమంలో బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇక బమ్రా వందో వికెట్‌ కూడా అలాగే వచ్చింది. ఆఫ్‌స్టంప్‌ మీదుగా వచ్చిన బంతిని అంచనా వేయడంలో పోప్‌ పొరబడ్డాడు. బంతి అద్భుతంగా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని నేరుగా వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం బుమ్రా తొలి వికెట్‌.. వందో వికెట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక 368 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా జట్టుగా రాణించి ఓవల్‌ గడ్డపై 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచింది. మళ్లీ ఇనేళ్లకు కోహ్లి నేతృత్వంలో భారత్‌ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఉమేశ్‌ బౌలింగ్‌లో ఆండర్సన్‌(2) ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు 210 పరుగుల వద్ద తెరపడింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా బుమ్రా, శార్దూల్‌, జడేజా తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.      

చదవండి: IND Vs ENG 4th Test: కపిల్‌ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం..

మరిన్ని వార్తలు