IND Vs AUS: విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్‌ తయారు చేస్తారా?

9 Mar, 2023 18:32 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్ మంజ్రేకర్‌ అహ్మదాబాద్‌ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన నాలుగో టెస్టు పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌ ట్రాక్‌లా కనిపిస్తుంది. తొలిరోజు ఆటలో టీమిండియా బౌలర్లు నానాకష్టాలు పడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా 104 పరుగులు నాటౌట్‌ సెంచరీతో కదం తొక్కగా.. కామెరాన్‌ గ్రీన్‌ 49 పరుగులు క్రీజులో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సంజయ్‌ మంజ్రేకర్‌ పిచ్‌పై ఆసక్తికరంగా స్పందించాడు. ''అహ్మదాబాద్‌ పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. మూడు సెషన్‌లు కలిపి టీమిండియా బౌలర్లు నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియడంపై విమర్శలు రావడంతో బయపడిన క్యురేటర్‌లు మరీ ఇలా 70, 80ల  కాలం నాటి పిచ్‌లను తయారు చేస్తారనుకోలేదు.

బ్యాటింగ్‌కు అనుకూలంగా జీవం లేని పిచ్‌పై షమీ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జడేజా పర్వాలేదనిపించినా.. అక్షర్‌, అశ్విన్‌లు మాత్రం వికెట్లు పడగొట్టలేకపోయారు. అయితే రెండోరోజు ఆటలో పిచ్‌లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందేమో.'' అని పేర్కొన్నాడు.

మంజ్రేకర్‌ వ్యాఖ్యలపై మరో కామెంటేటర్‌ మాథ్యూ హెడెన్‌ స్పందిస్తూ.. టెస్టు క్రికెట్‌ మ్యాచ్‌కు ఇది సరైన పిచ్‌లా అనిపిస్తుంది. తొలిరోజే అన్ని జరగాలంటే కుదరదు. రానున్న రోజుల్లో​ పిచ్‌ ప్రభావం చూపించే అవకాశం ఉంది. టీమిండియా స్పిన్‌ త్రయం వికెట్లు తీయలేకపోయినప్పటికి తమ ఇంపాక్ట్‌ను చూపించారు. జడేజాతో పాటు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు తమ స్పిన్‌తో రెండో రోజు ఆసీస్‌ను తిప్పేస్తారేమో.'' అంటూ తెలిపాడు.

మరిన్ని వార్తలు