Sourav Ganguly Resign: దాదాకు తప్పని ఫేక్‌న్యూస్‌ గోల..  ఇది వారి పనేనా?

11 Aug, 2022 13:58 IST|Sakshi

ఈ మధ్య ఫేక్‌న్యూస్‌ గోల మరీ ఎక్కువైపోయింది. ఉదాహరణకు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో భారత అథ్లెట్‌ హిమదాస్‌ స్వర్ణం కొల్లగొట్టిందంటూ కొందరు పనిలేని వ్యక్తులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత అదంతా ఫేక్‌ అని.. అసలు హిమదాస్‌ స్వర్ణం గెలవలేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు.. టీమిండియా మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ విషయంలోనూ గురువారం ఒక ఫేక్‌న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. 

అదేంటంటే.. బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా రాజీనామా చేశాడని.. అతని స్థానంలో ప్రస్తుత కార్యదర్శి పదవిలో ఉన్న జై షా అధ్యక్షుడిగా ఎన్నికవ్వనున్నాడంటూ కొందరు ఆకతాయిలు బీసీసీఐ పేరుతో ఉన్న ఫేక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. కానీ వాస్తవానికి బీసీసీఐ అధికారిక ట్విటర్‌ నుంచి గంగూలీ రాజీనామా చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. దీంతో గంగూలీ రాజీనామా అనేది ఫేక్‌ అని తేలిపోయింది. 

కాగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగాగా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీని వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్లు సంచలన నిర్ణయం తీసుకుంది. దీని వెనుక పరోక్షంగా దాదా హస్తం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న విభేదాల కారణంగా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారని సోషల్ మీడియాలో వార్తలు కూడా హల్‌చల్‌ చేశాయి.  దీంతో కోహ్లీ ఫ్యాన్స్, గంగూలీపై పీకల దాకా కోపంతో ఉన్నారు.  ప్రస్తుత ఐసీసీ ఛైర్మెన్‌గా ఉన్న గ్రెగ్ బార్‌క్లే త్వరలో ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు.

కాగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ఐసీసీ చైర్మన్‌ పదవిని చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ నేపథ్యంలో గంగూలీ ఐసీసీ ఛైర్మెన్‌గా బాధ్యతలు తీసుకోవాలంటే.. ఓకే సమయంలో రెండు పదవుల్లో ఉండడం సమజసం కాదు గనుక బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.  దీన్ని ఆధారంగా చేసుకుని సౌరవ్ గంగూలీ వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటున్నాడని.. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా... అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నట్టు కోహ్లి అభిమానులే ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేశారంటూ అభిమానులు పేర్కొన్నారు. 

ఇక టీమిండియా క్రికెట్‌లో  అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా దాదా పేరు పొందాడు. బెంగాల్‌ క్రికెట్‌లో దాల్మియా తర్వాత చక్రం తిప్పిన సౌరవ్‌ గంగూలీ 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. అధ్యక్షుడిగా ఆరు నెలల కాలానికి ప్రెసిడెంట్ కూర్చీ ఎక్కిన గంగూలీ.. రెండున్నరేళ్లుగా ఆ కుర్చీని వదలడం లేదు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్ష పదవి పెంపుకాలంపై సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కిన సంగతి తెలిసిందే.

ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కరోనా వైరస్‌, లాక్‌డౌన్ వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఐపీఎల్ 2020 సీజన్‌ను సౌరవ్‌ గంగూలీ సూపర్‌ సక్సెస్‌ చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌ తర్వాత 10 ఫ్రాంఛైజీలుగా ఐపీఎల్ 2022ని నిర్వహించిన దాదా అండ్ టీమ్, ప్రసార హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ బోర్డుకు రూ.48 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టాడు. అయితే త్వరలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఉన్నందున ఇప్పట్లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే ఆలోచనల్లో సౌరవ్ గంగూలీ లేడని సమాచారం. అయితే ఇవన్నీ దాదా అంటే గిట్టని వాళ్లు చేస్తున్న పనంటూ గంగూలీ అభిమానులు పేర్కొన్నారు.

చదవండి: బాలీవుడ్‌ హీరోయిన్‌కు పంత్‌ దిమ్మతిరిగే కౌంటర్‌

హిమ దాస్‌ స్వర్ణం గెలవలే.. నెట్టింట వైరలవుతున్న ఫేక్‌ ట్వీట్‌

మరిన్ని వార్తలు