Ind Vs Sa 3rd ODI: ధావన్‌కు విశ్రాంతి.. ఓపెనర్‌గా వెంకటేశ్‌.. భువీ వద్దు.. అతడే కరెక్ట్‌!

23 Jan, 2022 11:22 IST|Sakshi

Ind Vs Sa 3rd Final ODI: చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు టెస్టు సిరీస్‌ ఘోర పరాభవమే మిగిల్చింది. కనీసం వన్డే సిరీస్‌ సొంతం చేసుకుని ఆ లోటు తీర్చుకుందామని భావిస్తే అందులోనూ భంగపాటే. దీంతో ప్రొటిస్‌ జట్టుతో జరుగనున్న నామమాత్రపు మూడో వన్డేకు రాహుల్‌ సేన సిద్ధమవుతోంది. ఆదివారం నాటి ఆఖరి మ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

భారత్‌ భారీ మార్పులతో బరిలోకి దిగితేనే ఫలితం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు సంజయ్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘శిఖర్‌ ధావన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తను రెడీమేడ్‌ ఆప్షన్‌. ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే, తన స్థానంలో అలాంటి మరో ఆటగాడిని తయారుచేసుకోవాలి కదా. 

కాబట్టి ధావన్‌కు విశ్రాంతినిచ్చి వెంకటేశ్‌ అయ్యర్‌ను ఓపెనర్‌గా దింపితే బాగుంటుంది. కాబట్టి మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ను చేర్చుకోవచ్చు. ఇక బౌలర్ల విషయానికొస్తే.... భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో దీపక్‌ చహర్‌ను తీసుకోవాలి. శ్రీలంకలో అతడి బౌలింగ్‌ను చూశాం. మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇక జస్‌ప్రీత్‌ బుమ్రాకు రెస్ట్‌ ఇవ్వాలని భావిస్తే... సిరాజ్‌ లేదంటే ప్రసిద్‌కృష్ణను ఎంపిక చేసుకోవాలి. అశ్విన్‌ను పక్కనపెట్టి జయంత్‌ యాదవ్‌ను తీసుకోవాలి. తను 10 ఓవర్లు బౌల్‌ చేయగలడు. బ్యాటింగ్‌ కూడా చేస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: SA vs IND: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. విరాట్ కోహ్లి దూరం!

మరిన్ని వార్తలు