2nd Test Highlights: ముగిసిన మూడో రోజు ఆట

16 Feb, 2021 11:04 IST|Sakshi

చెన్నై:  టీమిండియా-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. కోహ్లి సేన 286 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ ముగించి.. పర్యాటక జట్టు కంటే 481 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. దీంతో 482 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భాగంగా మైదానంలో దిగిన ఇంగ్లండ్‌ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోరీ బర్న్స్'- డొమినిక్‌ సిబ్లి, జాక్‌ లీచ్‌ అవుటయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. లారెన్స్‌, జో రూట్‌‌ క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లు అక్షర్‌ పటేల్‌ 2, అశ్విన్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

మూడోరోజు అప్‌డేట్స్‌:  
► ఇంగ్లండ్‌ వరుసగా వికెట్లు కోల్పోతోంది. రెండో ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ చివరి బంతికి ఓపెనర్‌ రోరీ బర్న్స్ అవుట్‌ కాగా.. క్రీజులోకి వచ్చిన జాక్‌ లీచ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇక అంతకుముందు అశ్విన్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి బర్న్స్'‌  రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

►భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 17 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా మైదానంలో దిగిన ఓపెనర్‌ సిబ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. టీమిండియా ఆటగాడు అక్షర్‌ పటేల్ బంతికి చిక్కిన అతడు 3 పరుగులు చేసి నిష్క్రమించాడు. రోరీ బర్న్స్‌', డానియల్‌ లారెన్స్‌ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ తాజా స్కోరు  33/1. 

►చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 286 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ముగించిన కోహ్లి సేన, పర్యాటక జట్టు కంటే 481 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత జట్టు.. స్పిన్నర్ల మాయాజాలంతో రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 134 పరుగులకే కట్టడిచేసిన సంగతి తెలిసిందే. అయితే, రెండో ఇన్నింగ్స్‌‌ బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలినా అశ్విన్‌ సెంచరీ(106), కెప్టెన్‌ కోహ్లి అర్ధసెంచరీ(62)తో 286 పరుగులు చేయగలిగింది. తద్వారా ఇంగ్లండ్‌ 482 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. 

► రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ అద్భుత సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా బౌండరీ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో వరుస బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి సొంత మైదానంలో మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మలచుకున్నాడు. 103 పరుగులతో అతడు క్రీజులో ఉన్నాడు.

► టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జాక్‌లీచ్‌ బౌలింగ్‌లో ఇషాంత్‌ శర్మ ఓలి స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. సెంచరీ దిశగా పయనిస్తున్న అశ్విన్(87)‌, మహ్మద్‌ సిరాజ్‌ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ప్రస్తుత స్కోరు  247/9. ఇక తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని ఆతిథ్య జట్టు 442 పరుగులు ఆధిక్యంలో ఉంది.

► ఇప్పటికే రహానే, అక్షర్‌ పటేల్‌, కోహ్లి వికెట్లు తీసి టీమిండియాను కట్టడి చేసిన మొయిన్‌ అలీ మరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన కుల్దీప్‌.. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 214/8.

► కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న విరాట్‌ కోహ్లి (149 బంతుల్లో 62; 7ఫోర్లు) ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 202/7. రవిచంద్రన్‌ అశ్విన్‌ (56), కుల్దీప్‌ యాదవ్‌ (0) క్రీజులో ఉన్నారు.

► ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించి కోలుకోలేని దెబ్బతీసిన అశ్విన్‌ బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. ఏడో వికెట్‌గా క్రీజులోకొచ్చిన అతను కోహ్లితో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఓలీ స్టోన్‌ బౌలింగ్‌లో బౌండరీ బాదడం ద్వారా అశ్విన్‌ (65 బంతుల్లో 50;  7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

► వెనువెంటనే వికెట్లు తీసి టీమిండియాకు చెమటలు పట్టించిన ఇంగ్లండ్‌ స్పిన్నర్లను విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే కోహ్లి (107 బంతుల్లో 50; 7 ఫోర్లు) టెస్టుల్లో 25వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్‌ 38 పరుగులతో ఉన్నాడు. భారత్‌ ప్రస్తుత స్కోరు 173/6. 

► వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన భారత్‌ను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (38), రవిచంద్రన్‌ అశ్విన్‌ (34) ఆదుకున్నారు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు కీలకమైన 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 156/6. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 195 పరుగులతో కలిపి టీమిండియా ఓవరాల్‌గా 351 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

►మొయిన్‌ అలీ ఖాతాలో మరో వికెట్‌ పడింది. ఇప్పటికే రహానే వికెట్‌ తీసి భారత్‌ను దెబ్బకొట్టిన ఈ ఇం‍గ్లండ్‌ స్పిన్నర్‌ అక్సర్‌ పటేల్‌ (7)ని ఎల్బీగా పెవిలియన్‌కు పంపించాడు. ప్రస్తుతం భారత స్కోరు 120/6.  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(28), రవి చంద్రన్‌ అశ్విన్‌(8) క్రీజులో ఉన్నారు

► భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్‌ మొయిన్‌ అలీ, రహానె(10)ను అవుట్‌ చేశాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 90/5. కోహ్లి, అక్షర్‌‌ పటేల్‌ క్రీజులో ఉన్నారు.

► ఇంగ్లండ్‌ బౌలర్‌ జాక్‌ లీచ్ టీమిండియాను బెంబేలెత్తిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రిషభ్‌ పంత్‌ (8) జాక్‌ లీచ్ బౌలింగ్‌లో స్టంప్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇప్పటికే గిల్‌, రోహిత్‌ వికెట్లను లీచ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 74/4. కోహ్లి, రహానే క్రీజులో ఉన్నారు.

► జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (26) స్టంప్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. కీపర్‌ ఫోక్స్‌ మెరుపు వేగంతో బంతిని అందుకుని రోహిత్‌ను స్టంప్‌ ఔట్‌ చేశాడు. భారత్‌ ప్రస్తుతం 58/3 గా ఉంది. క్రీజులో కెప్టెన్‌ కోహ్లి (0), రిషభ్‌ పంత్‌ (3) క్రీజులో ఉన్నారు.

► మూడోరోజు ఆట మొదలైన కాసేపటికే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో పుజారా (7) అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. 

చదవండి:
నిన్న రహానే.. నేడు రోహిత్‌..

మరిన్ని వార్తలు