ఫైనల్లో రష్మిక భమిడిపాటి 

26 Nov, 2023 04:14 IST|Sakshi

ఐటీఎఫ్‌ మహిళల వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో రష్మిక 6–2, 6–1 స్కోరుతో రెండో సీడ్‌ లన్‌లనా తరారుడీ (థాయిలాండ్‌)పై విజయం సాధించింది. 57 నిమిషాల పాటు సాగిన పోరులో ఆద్యంతం రష్మిక ఆధిపత్యం కొనసాగింది. తరారుడీ ఒక ఏస్‌ కొట్టినా ఐదు డబుల్‌ ఫాల్ట్‌లతో ఓటమిని ఆహ్వానించింది.

మరో భారత క్రీడాకారిణి జీల్‌ దేశాయ్‌ కూడా ఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన ఈ సెమీస్‌లో జీల్‌ 3–6, 6–4, 7–5 స్కోరుతో భారత్‌కే చెందిన మూడో సీడ్‌ రుతుజ భోసలేను ఓడించింది. 2 గంటల 31 నిమిషాల పాటు పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన జీల్‌ విజేతగా నిలిచింది. రుతుజ 2 ఏస్‌లు కొట్టగా, జీల్‌ ఒక ఏస్‌ సంధించింది. జీల్‌ 7 డబుల్‌ ఫాల్ట్‌లతో పోలిస్తే 10 డబుల్‌ ఫాల్ట్‌లు చేసిన రుతుజ ఓటమిపాలైంది. 

మరిన్ని వార్తలు