దుమ్మురేపిన అశ్విన్‌.. కెరీర్‌ బెస్ట్‌కు రోహిత్‌

28 Feb, 2021 15:48 IST|Sakshi

దుబాయ్‌‌: ఐసీసీ ఆదివారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు.  తన టెస్టు కెరీర్‌లో తొలిసారి టాప్‌ 10లో అడుగుపెట్టిన రోహిత్‌ 742 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండో టెస్టులో సెంచరీ చేయడం.. మొటేరా వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో కఠినంగా ఉన్న పిచ్‌పై అర్థ సెంచరీతో మెరిశాడు.

కాగా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా మాత్రం రెండు స్థానాలు దిగజారి 708 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ర్యాంకింగ్‌లో మాత్రం ఏ మార్పు లేదు. 836 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 853 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. ఇక న్యూజిలాండ్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఆసీస్‌ స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. లబుషేన్‌ 878 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి 823 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మాత్రం ఒకస్థానం కోల్పోయి 746 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్‌ అండర్సన్‌ మూడు స్థానాలు దిగజారి 809 పాయింట్లతో 6వ స్థానంలో నిలవగా.. మరో ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 800 పాయింట్లతో ఏడో స్థానంలో  నిలిచాడు. ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ 908 పాయింట్లతో అగ్రస్థానం నిలుపుకోగా.. 825 పాయింట్లతో నీల్‌ వాగ్నర్‌(ఆస్ట్రేలియా) రెండో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్‌ విభాగంలో టీమిండియా నుంచి రవీంద్ర జడేజా రెండో స్థానాన్ని కాపాడుకోగా.. అశ్విన్‌ 5వ స్థానంలో ఉన్నాడు. విండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ 407 పాయింట్లతో టాప్‌ స్థానంలో నిలిచాడు.
చదవండి: ‘పిచ్‌ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’
'థ్యాంక్స్‌ పీటర్సన్‌.. అర్థం చేసుకున్నందుకు'

మరిన్ని వార్తలు