India Tour SA: "ధావన్‌ని భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం బెటర్‌"

13 Dec, 2021 16:46 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ ఎంపిక చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ వికెట్‌ కీపర్‌ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డేలకు శిఖర్ ధావన్‌ను భారత్ మినహాయించాలని సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టీమిండియా ఓపెనింగ్‌ స్ధానానికి తీవ్రమైన పోటీ నెలకొంది, ఈ నేపథ్యంలో ధావన్‌ జట్టుకు దూరం ఉండడం బెటర్‌ అని కరీమ్ తెలిపాడు.

“ఒక వేళ ధావన్ జట్టులో ఉన్నప్పటికీ, అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దొరుకుతుందా ? కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల్లో ఓపెనర్లు కావడంతో వన్డేల్లోనూ  ఓపెనింగ్ చేస్తారని నేను భావిస్తున్నాను. ధావన్‌ను జట్టులోకి తీసుకుంటే డగౌట్‌లో కూర్చుండబెట్టడం తప్ప మరో ఉపయోగం లేదు. అతడిని దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయరని నేను భావిస్తున్నాను" అని కరీమ్ యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.

"ధావన్‌కి మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం రావడం చాలా కష్టం. కానీ ఇటువంటి సీనియర్‌ ఆటగాడికి మరో అవకాశం ఇవ్వాలని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. మరి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హాజారే ట్రోఫిలో కూడా ధావన్‌ వరుసగా విఫలం అవుతున్నాడు. అతడికి ఇంకా ఈ టోర్నీలో ఒక మ్యాచ్ మాత్రమే ఉంది అని " అతడు పేర్కొన్నాడు.

ఇక శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించాడు. టీ20 ప్రపంచకప్‌-2021, స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ధావన్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుతం రోహిత్-రాహుల్ ఓపెనింగ్‌ జోడి అద్బుతంగా రాణిస్తున్నారు. అంతే కాకుండా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్,పృథ్వీ షా,  వెంకటేష్ అయ్యర్‌లు దేశవాలీ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్నారు. దీంతో  శిఖర్‌ దావన్‌ అంతర్జాతీయ కెరీర్‌ సందిగ్ధంలో పడింది.

చదవండి: David Warner: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌.. డేవిడ్‌ వార్నర్‌కు గాయం

మరిన్ని వార్తలు