Syed Mushtaq Ali Trophy: అంబటి రాయుడు, షెల్డన్‌ జాక్సన్‌ వాగ్వాదం.. వీడియో వైరల్‌

13 Oct, 2022 08:50 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు, యంగ్‌ క్రికెటర్‌ షెల్డన్‌ జాక్సన్‌ మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో భాగంగా ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే ఎలైట్‌ గ్రూఫ్‌ డిలో బుధవారం బరోడా, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్‌ జరిగింది.

సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ సమయంలో బ్యాటింగ్‌ చేస్తున్న షెల్డన్‌ జాక్సన్‌తో అంబటి రాయుడు ఏదో విషయమై మాట్లాడుతున్నాడు. చూస్తుండగానే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునే దాకా వెళ్లిపోయారు. ఇంతలో అంపైర్లతో పాటు ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే వీరి గొడవకు గల కారణం మాత్రం ఏంటనేది తెలియరాలేదు.

మాములుగానే అంబటి రాయుడు దూకుడు స్వభావం కలిగిన ఆటగాడు. ఇంతకముందు కూడా రాయుడు చాలా సందర్భాల్లో సహనం కోల్పోయి ఆటగాళ్లతో గొడవ పడిన దాఖలాలు ఉన్నాయి. టీమిండియాలో సరైన అవకాశాలు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన రాయుడు జూలై 2, 2019న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. టీమిండియా తరపున అంబటి రాయుడు 55 వన్డేలు ఆడి 1695 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలతో పాటు 10 అర్థసెంచరీలు ఉన్నాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. మితేష్‌ పటేల్‌ 60, విష్ణు సోలంకి 51 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సమరత్‌ వ్యాస్‌ 52 బంతుల్లో 97 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మార్క్‌ను చేజార్చుకున్నాడు. 

చదవండి: ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం!

తిలక్‌ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు

మరిన్ని వార్తలు