T20 World Cup: సంభాషణలు ఇలాగే ఉంటాయి మరి.. కోహ్లి, ధోని ఫొటో వైరల్‌!

19 Oct, 2021 08:19 IST|Sakshi
(Image source: Getty Via BCCI)

Virat Kohli and MS Dhoni Photo: చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథిగా జట్టుకు నాలుగో ట్రోఫీ అందించిన వెంటనే... మిస్టర్‌ కూల్‌ ధోని టీమిండియా మెంటార్‌గా పని మొదలుపెట్టేశాడు. టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో కోహ్లి సేనతో చేరి.. తన విలువైన సలహాలు, సూచనలు పంచుకుంటున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ధోని ఇలా.. జాతీయ జట్టుతో కలవడం, ఇండియన్‌ జెర్సీలో అతడిని చూసి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇక ‘కింగ్‌’ ధోనికి స్వాగతం చెబుతూ బీసీసీఐ షేర్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో ఫొటో భారత అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంగ్లండ్‌తో సోమవారం జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా మెంటార్‌ ధోని, కెప్టెన్‌ కోహ్లి... గేమ్‌ గురించి చర్చిస్తూ కెమెరాకు చిక్కారు. ‘‘ఎలాంటి అరమరికలు లేకుండా.. సరదాగా సాగే సంభాషణలు ఇలాగే ఉంటాయి మరి’’ అంటూ బీసీసీఐ ఈ ఫొటోను పంచుకుంది. కాగా ధోని మెంటార్‌గా రావడం పట్ల కోహ్లి సంతోషం వ్యక్తం చేస్తూ.. తన అనుభవం జట్టుకు అక్కరకు వస్తుందంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇక ధోని సారథ్యంలో మేటి క్రికెటర్‌గా ఎదిగి.. కెప్టెన్‌ స్థాయికి చేరుకుని.. ఇప్పుడు అతడి మార్గనిర్దేశనంలో టీ20 వరల్డ్‌కప్‌లో సారథిగా కోహ్లి టీమిండియాను ముందుకు నడిపించడం నిజంగా ప్రత్యేకమే! మ్యాచ్‌ విషయానికొస్తే... వార్మప్‌ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్(51)‌, ఇషాన్‌ కిషన్‌(70)ను ఓపెనర్లుగా బరిలోకి దించగా ఇద్దరూ అద్బుత ఇన్నింగ్స్‌తో ​ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కోహ్లి సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక అక్టోబరు 24న దాయాది పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ అసలు వేట మొదలుకానుంది.
చదవండి: T20 WC: ఇం‍గ్లండ్‌పై కోహ్లి సేన విజయం; ఏయ్‌.. మైకేల్‌ ఆఫ్‌లైన్‌లో ఉన్నావ్‌ ఏంది?!

మరిన్ని వార్తలు