T20 WC: ఇం‍గ్లండ్‌పై కోహ్లి సేన విజయం; ఏయ్‌.. మైకేల్‌ ఆఫ్‌లైన్‌లో ఉన్నావ్‌ ఏంది?!

19 Oct, 2021 07:48 IST|Sakshi

Wasim Jaffer Trolls Michael Vaughan Tweet Goes Viral: టీమిండియాతో మ్యాచ్‌ అనగానే వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి సిద్ధంగా ఉంటాడు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌. ముఖ్యంగా ఈ ఏడాది ఇంగ్లండ్‌.. భారత్‌లో పర్యటించిన సమయంలో పిచ్‌ల గురించి సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలిచాడు. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌... మైకేల్‌కు ధీటుగా బదులివ్వడంలో ముందు వరుసలో ఉంటాడు. వీరిద్దరి మధ్య ట్విటర్‌ వార్‌ అంటే నెటిజన్లకు కూడా ఆసక్తి మరి!! తాజాగా వసీం జాఫర్‌.. మైకేల్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య సోమవారం వార్మప్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో.. కోహ్లి సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జోస్‌ బట్లర్‌ సారథ్యంలోని ఇంగ్లిష్‌ జట్టు... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రాకు ఒకటి, షమీకి మూడు, రాహుల్‌ చహర్‌కు ఒక వికెట్‌ దక్కాయి. 

ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(51), ఇషాన్‌ కిషన్‌(70) శుభారంభం అందించారు. ఇక ఇషాన్‌ కిషన్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగగా.... కెప్టెన్‌ కోహ్లి 11, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ 29(నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(8), హార్దిక్‌ పాండ్యా(12 నాటౌట్‌)పరుగులు చేశారు.  ఈ క్రమంలో 19 ఓవర్లలో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఈ నేపథ్యంలో.. ‘‘ఈ విజయంలో మూడు ముఖ్య విషయాలు. కేఎల్‌, ఇషాన్‌ బ్యాట్‌తో.. బూమ్‌(బుమ్రా), అశ్‌(అశ్విన్‌), షమీ బాల్‌తో ఆకట్టుకున్నారు. ఇక మూడోది.. మైకేల్‌ వాన్‌ ఆఫ్‌లైన్‌లో ఉండటం’’ అంటూ వసీం జాఫర్‌ ట్రోల్‌ చేశాడు. నెటిజన్ల నుంచి ఇందుకు భారీ స్పందన వస్తోంది. వందల సంఖ్యలో రీట్వీట్లు చేస్తూ వాన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అదే విధంగా మ్యాచ్‌ సాగిన విధానంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు