ఆ హోదా ఇచ్చి తప్పుచేశారు!.. కివీస్‌ మాజీ ప్లేయర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

21 Sep, 2023 15:48 IST|Sakshi
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫర్వాలేదనిపిస్తున్న ఐర్లాండ్‌ (PC: IC)

Getting Test status was...: న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ సైమన్‌ డౌల్‌ ఐర్లాండ్‌ క్రికెట్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు టెస్టు హోదా కల్పించడం అన్నింకంటే చెత్త విషయమని పేర్కొన్నాడు. టెస్టు జట్టుగా మారడం ఐర్లాండ్‌ క్రికెట్‌కు హానికరంగా పరిణమించిందని వ్యాఖ్యానించాడు.

కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పసికూన అనే ముద్రను చెరిపేసుకునేందుకు కృషి చేస్తున్న ఐరిష్‌ టీమ్‌.. 2017లో టెస్టు జట్టు హోదాను దక్కించుకుంది. ఆ మరుసటి ఏడాది పాకిస్తాన్‌తో తమ తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన ఐరిష్‌ జట్టు.. 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఇక ఆ తర్వాత.. అఫ్గనిస్తాన్‌తో ఒకటి, ఇంగ్లండ్‌తో రెండు, శ్రీలంకతో రెండు టెస్టులాడింది. వీటన్నింటితో పాటు ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో ఆడిన ఏకైక టెస్టులోనూ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌ జట్టు పరాభవాలను ఉద్దేశించి సైమన్‌ డౌల్‌ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ..

ఫ్యాన్స్‌ను కోల్పోతానని తెలుసు
‘‘ఇలా మాట్లాడటం వల్ల నా అభిమానుల్లో కొంతమందిని కోల్పోతానని తెలుసు.. కానీ ఐర్లాండ్‌ విషయంలో జరిగిన చెడు ఏమిటంటే ఆ జట్టుకు టెస్టు హోదా రావడమే. నేను మాట్లాడేది సిల్లీగా అనిపించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్‌  ఆడాలనేది ఇప్పటికీ ఐర్లాండ్‌లోని కొద్ది మంది ప్లేయర్లకు మాత్రమే కల.

అప్పుడు కౌంటీ క్రికెట్‌లో ఆడుతూ
కానీ రానున్న 15-20 ఏళ్లలో ఇలాగే ఉంటుందని చెప్పలేం. నిజానికి తమ క్రికెటర్లు కౌంటీ క్రికెట్‌ ఆడేటపుడు ఐర్లాండ్‌ జట్టు అత్యుత్తమంగా ఉండేది. యూకేలో అత్యున్నత ప్రమాణాల స్థాయికి తగ్గట్లు వాళ్లు ఆడేవారు. దానినే జాతీయ జట్టులోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉండేవారు. ఒత్తిడి ఎలా జయించాలో తెలిసిన అనుభవజ్ఞులు జట్టులో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

కానీ ప్రస్తుతం ఐర్లాండ్‌ టీమ్‌ను చూస్తే అలా కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా  చెత్త ప్రదర్శనల నేపథ్యంలో టెస్టు హోదా వల్ల ఐర్లాండ్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదని.. భవిష్యత్తులో ఆ జట్టు మనుగడ కష్టమేనన్న ఉద్దేశంలో సైమన్‌ డౌల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 

చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్‌ కావాల్సినోడు.. 

మరిన్ని వార్తలు