Heart Attack: క్రికెట్‌ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో క్రికెటర్‌ మృతి

26 Feb, 2023 16:05 IST|Sakshi

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వసంత్ రాథోడ్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. పలు నివేదికలు ప్రకారం.. అహ్మదాబాద్ సమీపంలోని భదాజ్‌లోని డెంటల్ కాలేజీ ప్లేగ్రౌండ్‌లో జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

జీఎస్టీ ఉద్యోగి అయిన వసంత్ రాథోడ్ (34) గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తూ హార్ట్ ఎటాక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జీఎస్టీ విభాగంలో సీనియర్ క్లర్క్‌గా వసంత్ పనిచేస్తున్నాడు.  "వసంత్‌ రాథోడ్‌ జట్టు ఫీల్డింగ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అతడు బౌలింగ్ చేసే సమయంలో బాగానే ఉన్నాడు. అయితే ఫీల్డింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని సహాచరులు ఆసుపత్రికి తీసుకు వెళ్ళేటప్పటికే అతడు మరణించాడు" అని జీఎస్టీ విభాగం సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నాడు. కాగా గుజరాత్‌లో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. రాజ్కోట్ లో ప్రశాంత్ భరోలియా(27), సూరత్లో జిగ్నేష్ చౌహాన్(31) క్రికెట్‌ మైదానంలోనే గుండెపోటుతో మరణించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
చదవండి: Team india: హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ వద్దు.. వారిద్దరే సరైనోళ్లు! సెహ్వాగ్ అయితే?

మరిన్ని వార్తలు