TS High Court: టెన్త్‌ హిందీ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో విద్యార్థిపై డిబార్‌ ఎత్తివేత

7 Sep, 2023 12:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ హిందీ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో విద్యార్థిపై డిబార్‌ను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్‌ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే.. దీనిపై విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పదో పరీక్షలు హరీష్‌ రాశాడు. హరీష్ పదో తరగతి ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. హరీష్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు.. గురువారం తీర్పునిచ్చింది. హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది.

వరంగల్ జిల్లాలోని కమలాపూర్‌ జడ్పీ బాలుర హైస్కూల్‌లో టెన్త్‌ హిందీ ప్రశ్నాపత్రం లీక్‌ అవ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే టెన్త్ విద్యార్థి హరీష్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తేలడంతో విద్యార్థిని అధికారురలు డీబార్ చేశారు. తన కుమారుడు హరీష్‌ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని తండ్రి  హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

తన కుమారుడిని బెదిరించడంతోనే ప్రశ్నాపత్రం ఇతరులకు ఇచ్చాడని.. అదే వాట్సప్‌లో వచ్చిందన్నారు. తన కుమారుడిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు హరీష్‌‌ను పదో తరగతి పరీక్ష రాసేందుకు అనుమతించింది. తర్వాత ఫలితాలు విడుదల సమయంలో హరీష్ ఫలితాలను వెల్లడించకుండా హోల్డ్‌లో పెట్టారు. దీంతో మరోసారి విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విద్యార్థిపై ఉన్న డీబార్‌ను కొట్టివేస్తూ.. తక్షణమే ఫలితాలు వెల్లడించాలంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
చదవండి: ఎవరిది తప్పు.. ఎవరికి ముప్పు ?

మరిన్ని వార్తలు