21న ‘ఈడీ’ ఎదుట కాంగ్రెస్‌ భారీ నిరసన

19 Jul, 2022 01:45 IST|Sakshi

22న జిల్లాకేంద్రాల్లో ఆందోళనలకు పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా గాంధీ కుటుంబాన్ని వేధిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. ఈనెల 21న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌ ముందు నిరసన తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ, ఏర్పాట్లపై గాంధీభవన్‌లో సోమవారం నేతలు సమావేశమయ్యారు.

అనంతరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవితో కలిసి అంజన్‌కుమార్‌యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు. 21న ఉదయం 11గంటలకు నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ఇందులో పార్టీ సీనియర్‌ నేతలంతా పాల్గొంటారని చెప్పారు. 22న అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌గాంధీలపై ఈడీ కేసులు పెడుతున్నారని పార్టీ నేతలు గీతారెడ్డి, మల్లు రవి ఆరోపించారు.   

మరిన్ని వార్తలు