చేపతో కాజాలు ఎలా చేయాలంటే?

18 Mar, 2021 07:37 IST|Sakshi

చేపలతో తీరొక్క వంటకాలు

శిక్షణ పొందుతున్న ఎస్సీ మహిళలు

వేదికైన పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం

కూసుమంచి: ‘నీకేం తెలుసు.. చేపల పులుసు’ అని తేలిగ్గా తీసిపారేయొద్దు. చేపలతో 90 రకాల వెరైటీలు చేయొచ్చని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ వంటకాల తయారీలో మహిళలకు శిక్షణనిస్తూ ఘు మఘుమలాడుతోంది ఖమ్మం జిల్లా పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధన కేంద్రం. పోషకాహార విలువలు కలిగిన చేపలు.. చికెన్, మటన్‌తో పోలిస్తే చౌకగానే లభిస్తాయి. చేపలతో చేసే విభిన్న వంటకాలకు ప్రస్తుతం మార్కెట్లో మం చి గిరాకీ ఉంది. ఈ క్రమంలోనే చేపల వంటకాల తో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మత్స్య పరి శోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షణలో మహిళలకు శిక్షణనిస్తున్నారు.


ఇక్కడ ఇదే తొలిసారి
మహిళా మత్స్యకారులు కేవలం చేపలను పట్టి విక్రయిస్తేనే లాభం లేదు.. చేపల ఉత్పత్తులతో వంటకాలు తయారుచేసి విక్రయిస్తే అదనపు ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు మూడు దఫాలుగా 180 మంది మహిళా మత్స్యకారులకు శిక్షణనిచ్చారు. ప్రస్తుతం పంజాబ్‌లోని లూథియానాకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ హార్వెస్ట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ఎస్సీ మహిళలకు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా చేపల ఉత్పత్తుల తయారీలో శిక్షణనిస్తున్నారు. ఇందుకు వేదికైన పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం కూసుమంచి మండలం గైగొళ్లపల్లికి చెందిన 50 మంది మహిళలు తర్ఫీదు పొందుతున్నారు. శిక్షణానంతరం వీరంతా తాము తయారుచేసే చేపల ఉత్పత్తులతో స్వయం ఉపాధి కల్పించుకోవచ్చు.

మాంసంతో పచ్చళ్లు.. స్నాక్స్‌
ఏపీలోని భీమవరానికి చెందిన చేపల ఉత్పత్తుల తయారీ నిపుణురాలు పెన్మత్స భాగ్యలక్ష్మి పలు వంటలను పరిచయం చేస్తున్నారు. చేపల పులుసు, ఫ్రై, పచ్చడితోపాటు చేప కాజాలు, చేప చపాతీ, చేప ఫింగర్స్, చేప బజ్జీ, చేప పసంద్, చేప బిర్యానీ, ఫిల్లెట్స్, లాలీపాప్, సమోసాలు, రొయ్యల పొడి, రొయ్యల రోల్స్‌.. ఇంకా చేప మెత్తటి మాంసంతో కూర, పచ్చళ్లు, బోన్స్‌.. అందులోని కీమాతో స్నాక్స్‌.. ఇలా చేపలతో 90 రకాల వంటలను చేయవచ్చని ఇక్కడ చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు