ఉచిత బూస్టర్‌ డోస్‌ 24/7 

20 Jul, 2022 08:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర వ్యాప్తంగా ఉచిత బూస్టర్‌ డోస్‌ కార్యక్రమం ఊపందుకుంటోంది. గత ఏప్రిల్‌ 10 నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్లు పైబడిన వారికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమం నిర్వహించగా, తాజాగా దీనిని 18 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా విస్తరించారు. రెండో డోస్‌ నుంచి 6 నెలల వ్యవధి వచ్చిన ప్రతి ఒక్కరికీ బూస్టర్‌ టీకా అందించే ప్రక్రియను గత శుక్రవారం ప్రారంభించారు. నగర వ్యాప్తంగా మొత్తం 75 రోజుల పాటు ఉచిత బూస్టర్‌ డోస్‌ కార్యక్రమం కొనసాగనుంది.  

ఆఫీసులు.. కళాశాలల్లోనూ.. 
ఇటీవల కోవిడ్‌ కేసులు పెరగడం, కొత్త వేరియంట్ల రాకపై అంచనాల నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ బూస్టర్‌డోస్‌లకు ఆర్డర్‌ ఇచి్చంది. ఇవి అందుబాటులోకి రావడంతో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో కూడా టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు, యూనివర్సిటీలలోనూ ఏర్పాటు చేస్తున్నారు.

గత శనివారం వరకూ వానల కారణంగా విద్యా సంస్థలు మూసి ఉండడంతో సోమవారం నుంచీ వీటి ఏర్పాటు మొదలైంది. మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రానికి స్పందన చాలా బాగుందని, తొలిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యవధి నిర్ణయించుకోగా లబి్ధదారులు పెరగడంతో రాత్రి 8 గంటల దాకా కూడా కొనసాగించామని సెంటర్‌ ఇన్‌చార్జి సుధా ఓంకార్‌ చెప్పారు. 

20 వేలు దాటిన ఫ్రీ బూస్టర్‌ 
గత 15వ తేదీ నుంచి మంగళవారం దాకా 20,485 వరకు వ్యాక్సిన్లు అందించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్‌ చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో కాకుండా అభ్యర్థనను అనుసరించి 100 మందికి మించి విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ బూస్టర్‌ డోస్‌ కేంద్రాలను నెలకొల్పుతున్నామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ 24/7 కొనసాగుతుందన్నారు. 

(చదవండి: డిటెన్షన్‌ సెంటర్‌ @ వికారాబాద్‌! )

మరిన్ని వార్తలు