సాక్షి, హైదరాబాద్: ఆకస్మిక గుండెపోటు రావడంతోనే దాదాపు పది శాతం మరణాలు సంభవిస్తున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని ఎదుర్కోడానికి వెంటనే సీపీఆర్ చేయాలని, అలాంటప్పుడే ప్రాణాలను కాపాడవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. మెడీజీ అనే సంస్థ హైదరాబాద్ ఐఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ సహకారంతో ఆటోమేటెడ్ స్మార్ట్ సీపీఆర్ డివైజ్ను రూపొందించగా.. బుధవారం రాజ్భవన్లో వాటిని ప్రదర్శించారు.
కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఈ సంస్థ రూపొందించిన స్మార్ట్ సీపీఆర్ డివైజ్ను పరిశీలించిన ఆమె.. తయారీ దారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ డివైజ్ ధర రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల మధ్య ఉంటుందని తయారీ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సీపీఆర్ డివైజ్ అందుబాటులోకి వస్తే ఎక్కువ మంది ప్రాణాలను నిలబెట్టవచ్చన్నారు. అలాగే సీపీఆర్ పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన రావాల్సి ఉందని అన్నారు.