అల్పపీడన ప్రభావం: భారీ వర్ష సూచన

16 Aug, 2020 01:03 IST|Sakshi

వాయవ్య బంగాళాఖాతంలో  తీవ్ర అల్పపీడన ప్రభావం 

సాక్షి, హైదరాబాద్ ‌: వాయవ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమైం ది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో రెం డ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి మూడో నంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు దెబ్బతినే అవకాశం ఉందని, అలాగే రైల్వే శాఖ కూడా జాగ్రతగా ఉండాలని పేర్కొంది. 

నేడు పలుచోట్ల భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులు గా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నా యి. శనివారం రాష్ట్రంలో 4.52 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ సీజన్‌ లో ఇప్పటివరకు 48.8 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 64.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కాగా ఆది, సోమవారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, ములు గు, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూ చించింది. కాగా, ఈ సీజన్‌లో బంగాళాఖా తంలో మూడుసార్లు అల్పపీడనం ఏర్పడగా.. ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఎలాంటి ఆపద ఉన్నా కాల్‌ చేయండి 
∙ 040–23450624 నంబర్‌తో రాష్ట్ర స్థాయి కంట్రోల్‌ రూం  

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండడం, పలు ప్రాంతాలను వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నంబర్‌ 040–23450624కు కాల్‌ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైతే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూం లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. జిల్లాల్లో రైల్వే లైన్‌లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎస్‌ సూచించారు.  

20 వేల ఎకరాల్లో పంట నష్టం 
సాక్షి, హైదరాబాద్‌: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎడతెరపి లేని ముసురు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో పత్తి అత్యధికంగా 7,500 ఎకరాలు, వరి 5,700 ఎకరాలు, కందులు 3 వేల ఎకరాల్లో నష్టపోయినట్టు భావిస్తోంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ పంట నష్టం వాటిల్లినట్టు ఆ శాఖ ప్రాథమిక అంచనాల్లో తేల్చింది. 

మరిన్ని వార్తలు