Hyderabad: చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్.. 2 కిలోమీటర్లు వెంబడించి

28 Sep, 2022 13:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వాకింగ్‌ చేస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును స్నాచింగ్‌ చేసిన కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు నేరెళ్ల చెరువు వాకింగ్‌ ట్రాక్‌లో కేతావత్‌ రాధ వాకింగ్‌ చేస్తున్నారు. వెనుకనుంచి రన్నింగ్‌ చేస్తూ వచ్చిన కొండాపూర్‌ టీఎస్‌ఎస్‌పీ 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ కంటు రమేష్‌ (31).. రాధ మెడలోని 10 తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించాడు. అక్కడే వాకింగ్‌ చేస్తున్న ఇద్దరు యువకులు రెండు కిలోమీటర్లు వెంబడించి కానిస్టేబుల్‌ను పట్టుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.

నిందితుడి నుంచి రూ.3.90 లక్షల విలువ చేసే బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. విధులకు సరిగా హాజరు కాకపోవడంతో కానిస్టేబుల్‌ రమేష్‌ను 8 నెలల క్రితం అధికారులు సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని స్వగ్రామం ఆలవరంలో ఉద్యోగం పోయినప్పటి నుంచి నివాసముంటున్నాడు. ఇటీవలే మళ్లీ డ్యూటీలో చేరేందుకు అధికారులను కలవాలని హైదరాబాద్‌కు వచ్చాడు. అతనికి జీతం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.
చదవండి: Vikarabad: కొడుకు ప్రశ్నించాడని.. భోజనంలో విషం కలిపి 

మరిన్ని వార్తలు