ఏమిటీ కంటోన్మెంట్‌.. వివాదమేంటి?

13 Mar, 2022 02:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈస్టిండియా కంపెనీ పేరిట దేశంలో వ్యాపార కేంద్రాలను స్థాపించిన బ్రిటిషర్లు.. వాటి సంరక్షణ కోసం ప్రత్యేక సాయుధ బలగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బలగాలు ఉండే స్థావరాలను కంటోన్మెంట్లుగా పిలిచేవారు. అలా నిజాం హయాంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏర్పాటైంది. నిజాం రాజ్యం భారత్‌లో విలీనమయ్యాక.. కంటోన్మెంట్‌ సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అందులోని కొన్ని ప్రాంతాలను 1956లో హైదరాబాద్‌ మున్సిపాలిటీలో విలీనం చేశారు. ప్రస్తుతం 10వేల ఎకరాల విస్తీర్ణంలో కంటోన్మెంట్‌ కొనసాగుతోంది. 7వేల ఎకరాలు పూర్తిగా మిలిటరీ ఆధీనంలో ఉండగా, మిగతా 3 వేల ఎకరాల్లో సాధారణ ప్రజల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ఆర్మీ నేతృత్వంలోని కంటోన్మెంట్‌ బోర్డు పాలనలో ఉంటుంది. 

రోడ్ల మూసివేతతో..: సికింద్రాబాద్‌ ప్రాంతం నడిబొడ్డున కంటోన్మెంట్‌ ఉండటంతో.. చుట్టూ ఉన్న ప్రాంతాల మధ్య రాకపోకలకు కంటోన్మెంట్‌లోని రోడ్లే దిక్కయ్యాయి. అందులో మారేడ్‌పల్లి నుంచి మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌ ప్రాం తాలకు వెళ్లే రోడ్లను.. ఆరేళ్ల కింద ఆర్మీ అధికారులు భద్రతా కారణాలతో మూసేశారు. స్థానికుల ఆందోళన, సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తితో.. పగలంతా తెరిచి, రాత్రిళ్లు మూసివేస్తూ వచ్చారు. చివరికి ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయదలచినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. 

స్కైవేకు స్థలంపై వివాదం
రాష్ట్ర ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం కోసం కంటోన్మెంట్‌ బోర్డ్‌ పరిధిలో ఉన్న జింఖానా, పోలో మైదానాలను.. ప్యాట్నీ నుంచి హకీంపేట వరకు, ప్యారడైజ్‌ నుంచి సుచిత్ర వరకు స్కైవేల కోసం.. ఆ రోడ్ల వెంట కంటోన్మెంట్‌ స్థలాలను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినా.. ఆ స్థలాలను రాష్ట్ర సర్కారుకు అప్పగిస్తే.. తాము భారీగా ఆదాయాన్ని కోల్పోతామని కంటోన్మెంట్‌ బోర్డు మెలికపెట్టింది. ఏటా రూ.31 కోట్లు సర్వీస్‌ చార్జీలు ఇవ్వాలని కోరింది. దీనితో భూబదలాయింపు ఆగింది. దీనితోపాటు గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లోనూ ఇదే తరహా ఇబ్బందులు ఉన్నాయి.   

మరిన్ని వార్తలు