జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా ఆమోదం

31 Jan, 2023 01:44 IST|Sakshi
బోగ శ్రావణి, గోలి శ్రీనివాస్‌ 

నూతన ఇన్‌చార్జి చైర్మన్‌గా గోలి శ్రీనివాస్‌

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్‌ రవి

జగిత్యాల: జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్‌ రవి ఆమోదించారు. ఈ నెల 25న శ్రావణి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ రవి సోమవారం ఆమెను కలెక్టరేట్‌కు పిలిపించారు. రాజీనామా నిర్ణయాన్ని ఎవరి ఒత్తిడితోనైనా తీసుకున్నారా ? లేక సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? అని కారణాలు అడిగి తెలుసుకున్నారు.

తన ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని స్పష్టం చేసిన శ్రావణి.. మరోసారి లేఖ రాసివ్వడంతో కలెక్టర్‌ ఆమె రాజీనామా లేఖకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. కాగా, ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు రాగానే నూతన చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాల మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు ఆమెపై అవిశ్వాసానికి ప్రయత్నించడంతో శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు