ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య 

27 Oct, 2020 08:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఏజెన్సీల్లో మావోయిస్టులు మరింత అలజడి సృష్టిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో 15 రోజుల వ్యవధిలో మరో వ్యక్తిని హతమార్చారు. ఈ నెల 10న వెంకటాపురం మండలం ఆలుబాకలో టీఆర్‌ఎస్‌ నాయకుడు భీమేశ్వరరావును హత్య చేయగా, తాజాగా ఆదివారం ఉదయం చర్ల మండలంలోని చెన్నాపురం–గోరుకొండ గ్రామాల మధ్య ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన నాయకులపు ఈశ్వర్‌ను చంపి, రహదారిపైనే మృతదేహాన్ని వదిలివెళ్లారు. ఈశ్వర్‌ పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడనే నెపంతో హతమార్చినట్లు సమాచారం. మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయి.

మృతుడి గొంతుకు తాళ్లు బిగించి చంపినట్లుగా ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. మృతదేహాన్ని చర్లకు తరలించి పోస్టుమార్టం అనంతరం కటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు ఈశ్వర్‌ భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌ తెలిపారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సనీల్‌దత్‌ విడుదల చేసిన ప్రకటనలో మాత్రం మృతుడు ఈశ్వర్‌ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కీలక నేతలు హరిభూషణ్, దామోదర్, చంద్రన్నలకు కొరియర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. అతడిని మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఒత్తిడి చేశారని, అందుకు ఈశ్వర్‌ నిరాకరించడంతో హతమార్చారని వివరించారు.

మరిన్ని వార్తలు