బీజేపీ కుట్రలో పావులా మారొద్దు..

10 Aug, 2021 01:35 IST|Sakshi

ప్రవీణ్‌కుమార్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హితవు

సాక్షి, హైదరాబాద్‌: బలమైన ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా బీజేపీ కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ ఆరోపించారు. ఈ కుట్రలో మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పావుగా మారొద్దని హితవు పలికారు. ఆదివారం నల్లగొండలో జరిగిన బహిరంగ సభలో బీజేపీపై ప్రవీణ్‌కుమార్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే గురుకుల సొసైటీలో ప్రవీణ్‌ రాణించిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. అంతా తనవల్లే జరిగిందని డబ్బా కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలసి సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కిశోర్‌ మాట్లాడుతూ.. ఏ పార్టీలోనైనా చేరే హక్కు ప్రవీణ్‌కు ఉందని, అయితే కేసీఆర్‌పై ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం సహిం చేది లేదని హెచ్చరించారు. ఏనుగెక్కి ప్రగతిభవన్‌కు వెళ్తానంటూ ప్రవీణ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ఎవరి చేతుల్లో ఉందో తెలుసా అని ప్రశ్నించారు. గతంలోనూ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు పార్టీలు పెట్టి ఏమయ్యారో అందరికీ తెలుసని, ప్రగతిభవన్‌కు సుస్థిరంగా వెళ్లేది ‘కారు’మాత్రమేనని వ్యాఖ్యా నించారు. మేధావి ముసుగులో దళితులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. దళితబంధు పథకం చూసి కేసీఆర్‌ను విమర్శించే వారిలో భయం మొదలైందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి పథకాలు ఒక్కటి కూడా లేదని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. దళితవర్గాలకు నష్టం చేసే కుట్రలకు ప్రవీణ్‌కుమార్‌ లాంటి వారిని బీజేపీ వాడుకుంటోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు