ఐపీవోకు జెమినీ వంట నూనెలు

10 Aug, 2021 01:35 IST|Sakshi

సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ దాఖలు

రూ. 2,500 కోట్ల సమీకరణకు రెడీ

ఫ్రీడమ్‌ బ్రాండ్‌ వంట నూనెల కంపెనీ

హైదరాబాద్‌: వంట నూనెల తయారీ సంస్థ జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతిని కోరుతూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్లతోపాటు.. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన వాటాదారులు సైతం వాటాలను విక్రయానికి ఉంచనున్నట్లు జెమినీ ఎడిబుల్స్‌ తెలియజేసింది. ప్రదీప్‌ చౌధరి రూ. 25 కోట్లు, అల్కా చౌధరి రూ. 225 కోట్లు, గోల్డెన్‌ ఆగ్రి ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 750 కోట్లు, బ్లాక్‌ రివర్‌ ఫుడ్‌ 2పీటీఈ రూ. 1,250 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ కమర్షియల్‌ ఎంటర్‌ప్రైజ్‌ పీటీఈ రూ. 250 కోట్లు చొప్పున ఈక్విటీని ఆఫర్‌ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.  

వాటాల వివరాలిలా
ప్రస్తుతం జెమినీ ఎడిబుల్స్‌లో గోల్డెన్‌ అగ్రికి 56.27 శాతం, అల్కా చౌధరికి 11.56 శాతం, బ్లాక్‌ రివర్‌ ఫుడ్‌కు 25 శాతం, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ కమర్షియల్‌కు 6.6 శాతం, ప్రదీప్‌కు 0.57 శాతం చొప్పున వాటా ఉంది. ఫ్రీడమ్‌ బ్రాండ్‌తో జెమినీ ఎడిబుల్స్‌ వంట నూనెలు విక్రయించే సంగతి తెలిసిందే. వంట నూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్‌ తయారీ, పంపిణీ, బ్రాండింగ్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ఈక్విటీ షేర్లను లిస్టింగ్‌ చేయాలని కంపెనీ భావిస్తోంది. కాగా.. ఇటీవలే ఫార్చూన్, ఆధార్‌ బ్రాండ్‌ వంట నూనెల దిగ్గజం అదానీ విల్మర్‌ సైతం సెబీకి ఐపీఓ  కోసం దరఖాస్తు చేయడం గమనార్హం!

మరిన్ని వార్తలు