సిరిసిల్లలో చిరుత సంచారం కలకలం.. పొలాల్లో ఈనిన చిరుత

22 Sep, 2023 17:45 IST|Sakshi

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ పిల్లను చిరుత తీసుకువెళుతుండగా పొలం పనులకు వెళుతున్న రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు.

దీంతో చిరుత రైతుల అలజడి విని ఓ పిల్లను వదిలేసి వెళ్ళింది. చిరుత పిల్లను చూసేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. చిన్న చిరుతతో ప్రజలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పాల కోసం ఏడుస్తున్న చిరుత పిల్లలకు పాలు తాగించే యత్నం చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పిల్లను కరీంనగర్‌కు తరలించారు.

చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను హెచ్చరించారు. అయితే చిరుత పిల్ల లభ్యం కావడంతో శివంగులపల్లితో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు