రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

28 Mar, 2023 01:44 IST|Sakshi
షేక్‌ ఇబ్రహీం, షేక్‌ మహమ్మద్‌ ముషబర్‌ బాషా(ఫైల్‌ )
● మృతులు రైల్వే కోడూరువాసులు ● వరుసకు అన్నదమ్ములు

రేణిగుంట: రేణిగుంట–రైల్వే కోడూరు మార్గంలో కుక్కలదొడ్డి సమీపాన దివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రేణిగుంట ఎస్‌ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన షేక్‌ ఇబ్రహీం(21), షేక్‌ మహమ్మద్‌ ముషబర్‌ బాషా(30) వరుసకు అన్నదమ్ములు. ఎంజీ రోడ్డులో ఇబ్రహీం చెప్పుల దుకాణం, మహమ్మద్‌ ముషబర్‌ బాషా దుస్తుల దుకాణం నడుపుతున్నారు. మహమ్మద్‌ ముషబర్‌ బాషాకు వివాహమై ఏడాదిన్నర వయస్సు కలిగిన కుమారుడు ఉన్నాడు. ఇబ్రహీంకు ఇంకా వివాహం కాలేదు. సోదరులైన వీరిద్దరూ ఆదివారం చైన్నెలోని తమ బంధువుల వద్ద ఓ మోటార్‌బైక్‌, సెల్‌ఫోను కొనుగోలు చేసేందుకు ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం చైన్నెకి బయల్దేరారు. చైన్నెకి చేరుకుని అక్కడ బేరం కుదరకపోవడంతో కేవలం సెల్‌ఫోను మాత్రమే తీసుకున్నారు. ఆదివారం రాత్రి స్వస్థలానికి తిరుగు పయనమయ్యారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో రేణిగుంట మండలం కుక్కలదొడ్డి సమీపంలోని దర్గా వంతెన వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మహమ్మద్‌ ముషబర్‌ బాషా తల, మొండెం వేరై తునాతునకలుగా ఛిద్రమై పడిపోయాయి. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్‌వీ వైద్య కళాశాలకు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించడంతో వారు మార్చురీకి చేరుకుని భోరున విలపించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు