తిరుపతి అర్బన్: ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు హోదాను కల్పించడంపై ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 49,500 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. అయితే ఉద్యోగ సంఘంలో 25శాతం ఉద్యోగులు ఉంటేనే గుర్తింపు హోదా వస్తుందన్నారు. ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో 14,233 మంది ఉద్యోగులు ఉన్నారని, తమపై నమ్మకంతో హోదా కల్పించినందుకు ఆ నమ్మకాన్ని నిలపెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్మికులుగా ఉన్న తమను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులు చేశారని సీఎంను కొనియాడారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు సంబరాలు చేస్తామన్నారు. తమ అసోసియేషన్కు గుర్తింపు హోదా కల్పించేందుకు కృషి చేసిన గోరవాధ్యక్షులు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డికి, రవాణాశాఖా మంత్రి విశ్వరూప్కు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
డిసెంబర్ నుంచి
కందిపప్పు, గోధుమ పిండి
తిరుపతి అర్బన్: చౌకదుకాణాల్లో వచ్చే డిసెంబర్ నుంచి కందిప్పపు, గోధుమపిండి పంపిణీ చేయనున్నట్లు సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ వై.సుమతి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని చౌకదుకాణాలకు 10 వేల మెట్రిక్ టన్నుల రాగులను సరఫరా చేశారని వెల్లడించారు. రేషన్ డీలర్లు ప్రతి నెలా 20వ తేదీలోపు డీడీలు చెల్లిస్తే, 21వ తేదీ నుంచి నెల చివరికల్లా అన్ని రేషన్ షాపులకు రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని చెప్పారు. ఉచితంగా అందిస్తున్న బియ్యం, రాగులను కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
నేడు అష్టోత్తర శతకలశాభిషేకం
రాపూరు: పెంచలకోనలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం చిలు క ద్వాదశిని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఉసిరి, తులసి చెట్లకు ప్రత్యేక పూజలు, కార్తీక వనభోజనాలు ఉంటాయన్నారు.
నేటితో ముగియనున్న
వీసీ పదవీ కాలం
తిరుపతి సిటీ : ఎస్వీయూ వీసీ కె.రాజారెడ్డి పదవీకాలం శుక్రవారంతో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించిన సెర్చ్ కమిటీ వీసీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైంది. పదుల సంఖ్యలో ఆశావాహులు విజయవాడ సీఎంవో కార్యాలయంలో సంప్రదిస్తున్నట్టు సమాచారం. సెర్చ్ కమిటీ పరిశీలనలో ఉండటంతో అంతవరకు నెల్లూరు సింహపురి యూనివర్సిటీ, పద్మావతి మహిళా వర్సిటీ వీసీ లను ఇన్చార్జిలుగా నియమించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.