ఖిల్లాఘనపురం: సమాజంలో అంతరించిపోతున్న ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోటపల్లి హుస్సేన్ అన్నారు. శనివారం మండలంలోని వెంకటాంపల్లిలో డప్పు కళాకారుల శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. కళాకారులందరూ సంఘటితంగా ఉండి శిక్షణలో కొత్త దరువులు, నృత్యాలు నేర్చుకోవాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. కళాకారుల సంఘం ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం మండల నాయకులు అశోక్, కుర్మయ్య, వెంకటస్వామి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్లో
ముమ్మరంగా తూకాలు
దేవరకద్ర: వరి కోతలు ప్రారంభం కావడంతో పెద్దఎత్తున మార్కెట్కు వచ్చిన ధాన్యం టెండర్లు పూర్తయిన రెండు రోజులుగా తూకాలు వేసే సమయం సరిపోకపోవడంతో మార్కెట్లో ధాన్యం రాసులు పేరుకుపోయాయి. దీంతో శనివారం పేరుకుపోయిన ధాన్యంను తూకాలు వేసి లోడింగ్ చేశారు. గురు, శుక్రవారాల్లో మార్కెట్కు వచ్చిన సోనామసూరి, హంస ధాన్యం పెద్దఎత్తున మార్కెట్లోనే నిల్వ ఉండటంతో శనివారం రోజంతా కేవలం ధాన్యం తూకాలు వేయడంతోపాటు లారీలకు లోడింగ్ చేశారు. శనివారం మార్కెట్కు సెలవు కలిసివచ్చింది. ఇక ఆదివారం కూడా సెలవు ఉండడంతో లావాదేవీలు జరగవు.
శనేశ్వరుడికి
తిలతైలాభిషేకం
బిజినేపల్లి: శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా మండలంలోని నందివడ్డెమాన్కి చెందిన జైష్ట్యాదేవి శనేశ్వరుడికి తిలతైలాభిషేక వర్షాన్ని తలపించేలా భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శనేశ్వరుడికి భక్తుల చేత గోత్రనామార్చన, ప్రదక్షిణలు, తిలతైలాభిషేకాలు, జిల్లెడు పూల సమర్పణ వంటి పూజలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుని శనిదోష నివారణకు ప్రత్యేకంగా పూ జలు నిర్వహించి, శివుడిని దర్శించుకున్నారు.
పొదుపు అలవర్చుకోవాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): విద్యార్థి దశ నుంచే పొదుపు చేయడం అలవర్చుకోవాలని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి అన్నారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల లో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ అకౌంటింగ్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విత్త ప్రణాళిక, వాటి ఆవశ్యతకత, వినియోగదారుడు–పరిరక్షణ, చట్టాలు– వినియోగ విద్య అంశంపై సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం డీసీఐడీ అధ్యక్షుడు బాల్లింగయ్య సమాజంలో వినియోగదారుల పాత్ర, వినియోగదారుల హక్కులు, బాధ్యత చట్టాలపై అవగాహన కల్పించారు. నాగలక్ష్మి, వాసంతి పాల్గొన్నారు.