‘ప్రజల సహకారంతోనే కరోనా నియంత్రణ సాధ్యం’

23 Mar, 2020 15:27 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నమోదు అయిన 6 కరోనా పాజిటివ్‌ కేసులలో వారి ఆరోగ​ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో కరోనా వ్యాప్తి రెండవ దశలో ఉందని, మూడవ దశలోకి వెళ్లకుండా నిరోధించేందకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించమని సీఎం జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు. 

కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి మృతి

కాగా.. ప్రజల సహకారంతోనే కరోనాను నియంత్రించగలమని మంత్రి అన్నారు. పాజిటివ్‌ కేసులు నమోదు అయిన జిల్లాలలో ప్రజలను మరింతగా అప్రమత్తం చేయ్యాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంకు 100 పడకల ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 108 సిబ్బందికి అవసరమైన పరికరాలు.. వస్తువులు అందించడంతో పాటుగా.. వారికి మనోధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తక్కవగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం..పరిశుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించగమన్నారు. లాక్ అవుట్ నేపథ్యంలో ఎవరైనా నిత్యవసర వస్తువుల ధరలు పెంచినా... బ్లాక్ మార్కెటింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు