పాస్‌పోర్ట్‌కు బర్త్‌ సర్టిఫికెట్‌ అక్కర్లేదు

27 Jul, 2017 01:19 IST|Sakshi
పాస్‌పోర్ట్‌కు బర్త్‌ సర్టిఫికెట్‌ అక్కర్లేదు
- ఇకపై ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఉన్న వివరాలే ప్రాతిపదిక
విదేశీ మంత్రిత్వ శాఖ నిర్ణయం
 
సాక్షి, అమరావతి: పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఇకపై బర్త్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆ సర్టిఫికెట్‌ ఉంటేనే పాస్ట్‌పోర్ట్‌ వచ్చే పరిస్థితి. అయితే తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ల జారీని సరళతరం చేసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలకు విదేశీ మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ గుర్తింపు కార్డుతోనైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఆధార్, ఓటరుకార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర కార్డులపై పుట్టిన తేదీ వివరాలు ఉండాలి. కాగా, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ జనన ధృవీకరణకు ప్రాతిపదికగా ఉండేది. కొంతమంది నిరక్షరాస్యులు ఈ నిబంధన వల్ల పాస్‌పోర్ట్‌ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసే ఏవైనా రెండు గుర్తింపు కార్డులుంటే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే పోలీసు వెరిఫికేషన్‌ కూడా దరఖాస్తు చేసిన వారంలోగా పూర్తి చేస్తున్నట్టు పేర్కొంది.
 
పాస్‌పోర్ట్‌ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..
 ఆధార్‌ కార్డు
 ఓటరు కార్డు
 డ్రైవింగ్‌ లైసెన్సు 
 ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ బిల్లు 
 అద్దెకున్న వారు రెంటల్‌ అగ్రిమెంట్‌ ఇవ్వాలి
 విద్యార్థులకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌
మరిన్ని వార్తలు