జియో అమరావతి మారథాన్‌కు విశేష స్పందన

27 Jan, 2019 16:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: జియో అమరావతి మారథాన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతిలోని మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద మొదలైన ఈ మారథాన్‌లో సుమారు 5000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఏపీ రాజధానిలో జియో అమరావతి మారథాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి.

5కే, 10కే, 21కే కేటగిరిల్లో పోటీలు నిర్వహించారు. 21కే రన్‌ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఐఏఎస్ అధికారి క్రాంతిలాల్ దండే, ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్‌లు జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించారు.10కే రన్‌ను మంత్రి నక్కా ఆనంద్ బాబు, స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం జెండా ఊపి ప్రారంభించారు. 5కే రన్‌ను  జియో ఏపీ సీఈవో మహేష్ కుమార్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం మహేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జియో అమరావతి మారథాన్ రన్‌లో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి నగరం అభివృద్ధి కోసం నిర్వహించే రన్‌లో నగరవాసులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో మరింతగా డిజిటల్ సేవలను విస్తరించాలనే ఉద్దేశ్యంతో మారథాన్‌లో భాగస్వాములమైనట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు