‘నేనూ హీరోగా నటించా’

22 Aug, 2014 11:14 IST|Sakshi
‘నేనూ హీరోగా నటించా’

అమలాపురం : ఆధునిక కాలంలో కూడా జానపదానికి ప్రాణం పోస్తున్నారు జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్. ‘ఏం పిల్లో, ఎల్దామొస్తవా..’ అంటూ తన పాటతో తెలుగు వారిని ఉర్రూతలూగించారు. కోనసీమలో షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన  అమలాపురంలో మాట్లాడారు.

 ప్రశ్న : ఉద్యమకారునిగా మీరు?
 జవాబు :  47 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాల్లో పాలుపంచుకున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమం, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపైన ప్రజలతో కలిసి పదం కలిపి ఉద్యమించాను. ప్రజాఉద్యమాల్లో పాటలు పాడాను. ఇలాంటి పాటలు సుమారు 300 రచించాను. రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను.

 ప్ర: మీ పాట గురించి..!
 జ : ముఖ్యంగా ‘ఏం పిల్లో, ఎల్దామొస్తవా..’ అనే పాట 50 భాషల్లో అనువాదమైంది. అలాగే ‘యంత్రమెట్ట నడుస్తున్నదంటే..’ పాట లండన్, అమెరికాలో ఇంగ్లిష్‌లో అనువాదం చేసుకుని పాడారు.

 ప్ర : సినీ రంగానికి రావడం?
 జ : ఇప్పుడు కాదు, 80వ దశకంలోనే నేను హీరోగా ఓ సినిమాలో నటించాను. అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాలో నలుగురు హీరోల్లో నేను ఒకడిని. ఆ తర్వాత అంతగా నచ్చిన పాత్రలు రాకపోవడంతో నటించలేదు. ‘సూరి’ చిత్రంలో ఉద్యమకారుడి పాత్ర ఉందని డెరైక్టర్ ఈఎస్ వెంకట్ చెప్పారు. నాకు నచ్చడంతో చేస్తున్నాను.

 ప్ర : మరి పాటలు రాయడానికి విరామమిస్తారా?
 జ : లేదు. ఇక మీదట కూడా జానపదాన్ని, జానపద సంస్కృతిని బలపరిచే పాటలు రాస్తా.

 ప్ర : రాజకీయాల్లోకి?
 జ : ప్రజా రాజకీయాలు చేస్తాను. ప్రజల కష్టసుఖాల్లో ఉండడమే రాజకీయం. ప్రజా పోరాటాలు ఎవరు చేసినా బలపరుస్తాను.

 ప్ర : జానపద సంస్కృతిని కాపాడాలంటే?
 జ : జానపదాన్ని ఆధునికీకరించి, ప్రజా సమస్యలను అందులో చొప్పించి ప్రజల్లోకి తీసుకువెళ్లడమే నా ఉద్దేశం. జానపదాన్ని నవతరం అర్ధం చేసుకుని జానపదతత్వం పోకుండా యువకులు ఆధునికీకరించాలి. యువత జానపదాన్ని కాపాడితేనే విషసంస్కృతిని ఆపగలం.
 

మరిన్ని వార్తలు