‘వైఎస్‌ జగన్‌ను సీఎం చేయటమే అంతిమ లక్ష్యం’

30 Jan, 2019 14:23 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే తన అంతిమ లక్ష్యమని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  1500 నుంచి 2000 మందితో గురువారం వైఎస్‌ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ముందుకు వెళతానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది దుశ్చర్యలు, దుష్ప్రచారం చూడలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నానని, కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు టీడీపీలో తనపై దౌర్జన్యం చేశారని వాపోయారు.

అన్యాయంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం తన వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతుంటే కార్యకర్తలు అందరూ తన వెంట ఉంటానన్నారని చెప్పారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవర్ని పెట్టినా కలిసి పనిచేస్తామని తెలిపారు. రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్‌ జగన్‌కు కానుకగా ఇవ్వనున్నామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, మోసాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళని, చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటంటూ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు