సార్వత్రిక యుద్ధం

12 Apr, 2014 03:32 IST|Sakshi

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మొన్న మున్సిపోల్స్.. నిన్న ప్రాదేశిక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వంతు. అతి కీలకమైన ఈ ఎన్నికలకు అటు పార్టీలు, ఇటు అధికార యంత్రాంగం సర్వ సన్నాహాలతో సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికల ప్రక్రియకు శనివారం తెర లేస్తుంది.

జిల్లాలో పది అసెంబ్లీ, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాలతోపాటు విజయనగరం, అరకు లోక్‌సభ స్థానాల్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ మేరకు అధికారులు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభం నుంచే అటు రాజకీయ పార్టీలు.. ఇటు అధికారవర్గాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది.

మొదట సార్వత్రిక ఎన్నికలకే అందరూ సిద్ధమవుతున్న తరుణంలో ఊహించని విధంగా మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను ఉన్న పళంగా నిర్వహించాల్సి వచ్చింది. మొదట మున్సిపల్ ఎన్నిక లు..  తర్వాత రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారు. శుక్రవారం నాటి పోలింగ్‌తో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇంతవరకు అటో కాలు.. ఇటో కాలు అన్నట్లు స్థానిక, సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లతో ఉక్కిరిబిక్కిరైన అధికార యంత్రాంగం ఇప్పుడు పూర్తిస్థాయిలో సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో శనివారం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేస్తారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది.

 ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి ఆదికారులు వివిధ స్థాయిల్లో సమావేశాలు, సమీక్షలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిం చారు. నామనేషన్ పత్రాలు వంటి అవసరమైన సరంజామా సిద్ధం చేశారు. నియోజకవర్గాలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిట ర్నింగ్ అధికారలు,రాష్ట్ర స్ఠాయి పరిశీలకులు నియామకాలు పూర్తి చేశారు. నామనేషన్ల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌కు జిల్లాలో 2450 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాం తాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

 లోక్‌సభ, అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులు
 లోక్‌సభ నియోజకవర్గాలకు జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ ఆధికారులుగా వ్యవహరిస్తారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ రిటర్నింగ్ అధికారి కాగా.. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఆయన కార్యాలయంలో నామినేషన్లు సమర్పించా ల్సి ఉంటుంది. విజయనగరం లోక్‌సభ స్థానానికి అక్కడి కలెక్టరేట్, అరకు స్థానానికి పాడేరు ఐటీడీఏలో నామినేషన్లు సమర్పించాలి. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకు ళం, ఆమదాలవలస, నరసన్నపేట .. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో ఉన్నాయి.

రాజాం, ఎచ్చెర్ల సెగ్మెంట్లు విజయనగరం లోక్‌సభ పరిధిలోనూ, పాల కొండ అసెంబ్లీ సెగ్మెంట్ అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆర్డీవోలు, ఆ స్థాయి అధికారులు ఆర్వోలుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థులు సంబంధిత ఆర్వోలకు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.

 సుమారు 19.30 లక్షల ఓటర్లు
ఎన్నికల్లో 19,29,435 మంది ఓటర్లు పాల్గొననున్నారు. వీరిలో పురుషులు 9,64,055 మంది కాగా మహిళలు 9.65,190 మంది ఉన్నారు. ఇతరులు 190 మంది ఉన్నారు. కాగా ఈ నెల 9వ తేదీ వరకు జరిగిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఓటుహక్కు కోసం జిల్లాలో సుమారుగా 63వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి కూడా ఓటు హక్కు వచ్చే అవకాశం ఉంది, ఈ నెల 18న ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల వివరాలు ప్రకటించనుంది. అందువల్ల పోలింగ్ నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరగవచ్చు.

 ముందున్న వైఎస్‌ఆర్‌సీపీ
స్థానిక ఎన్నికలు ముగియడంతో రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తులు చేస్తున్నాయి. ఈ విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ ముందంజలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ పార్టీపరంగా ఇప్పటికే ప్రచారపర్వంలో ముందుకు దూసుకుపోతోంది. పార్టీ పార్లమెంటు అభ్యర్థి రెడ్డి శాంతి, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ జనభేరి పేరుతో జిల్లాలో ఒక విడత ప్రచారం పూర్తి చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. లోక్‌సభతోపాటు ఐదుగురు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మిగిలిన ఐదు స్థానాల విషయంలో అంతర్గత పోరుతో సతమతమవుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క అభ్యర్థి కూడా ఇంతవరకు ఖరారు కాలేదు. ప్రచారం ఊసే లేదు.

మరిన్ని వార్తలు