రిమ్స్‌లో ప్రచ్ఛన్న యుద్ధం!

15 Aug, 2014 02:16 IST|Sakshi
రిమ్స్‌లో ప్రచ్ఛన్న యుద్ధం!

రిమ్స్‌క్యాంపస్: ఎవరైనాతప్పు చేస్తే వారిని మందలించటం సహజం. మరీ అవసరమైతే చర్యలు తీసుకోవటం ఏ శాఖలోనైనా పరిపాటే. తప్పు చేసిన వారు కూడా ఒక్కోసారి తలవంచుకుపోతారు. అదే తప్పు చేయకుండానే ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమైతే? కిందిస్థాయి సిబ్బందిలో ఆగ్రహావేశాలు ముంచుకొస్తాయి. కొద్దిసేపు సహనం వహిస్తారు. అప్పటికీ అధికారుల తీరు మారకపోతే ఆందోళనకు సిద్ధమవుతారు. ఇదే పరిస్థితి జిల్లాకు తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకొంది. కొద్దిరోజులుగా ఏదో ఒక విషయంలో రిమ్స్‌లో నెలకొంటున్న విభేదాలు మరోసారి తారస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలో సుమారు 250 మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి విధులను నర్సిం గ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. ఎవరైన విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే నర్సింగ్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకుంటారు. అయితే ఇక్కడ పరిస్థితి తారుమారైంది. నర్సింగ్ స్టాఫ్ పై  రిమ్స్ డెరైక్టర్ అజమాయిషీ చెలాయించేందుకు చూస్తున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. రిమ్స్ మొత్తానికి ఉన్నతాధికారిగా ఆయనకు అధికారం ఉన్నప్పటికీ లేనిపోని తప్పులను చూపించడాన్ని మాత్రం నర్సింగ్ స్టాఫ్ తట్టుకోలేకపోతున్నారు.
 
 ఇటీవల వార్డు ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వార్డులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోగులకు ఏ విధమైన సేవ లు అందుతున్నాయి, దొంగతనాలు జరుగకుండా ఇలా వీటి ద్వారా అధికారులు పరిశీలించి తెలుసుకుంటున్నారు. అయితే స్టాఫ్ నర్సులు రోగులకు సేవలందించిన తరువాత సంబంధిత రికా ర్డు వర్క్, డైట్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాఫ్ నర్సులు వార్డులో వారికి కేటాయించిన చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల ఓ వార్డులో స్టాఫ్ నర్సులు ఒకే దగ్గర కూర్చొని ఉండటాన్ని సీసీ కెమెరాలో చూసిన రిమ్స్ డెరైక్టరు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
 
 మెమోలివ్వాలంటూ ఆదేశాలు
 స్టాఫ్ నర్సులంతా ఒకచోట కూర్చొని ఉండటాన్ని తప్పుబట్టిన డెరైక్టర్ ఆ సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో వారికి మెమోలివ్వాలంటూ నర్సింగ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలను జారీ చేశారు. అయితే రికార్డు వర్క్ చేసుకుంటున్న వారికి ఏ విధంగా మెమోలిస్తామంటూ సూపరింటెండెం ట్లు డెరైక్టరుకు వివరించారు. డెరెక్టర్ మాత్రం వీరి మాటలను పట్టించుకోలేదు. వారికి మెమోలివ్వకుంటే నేను మీకు మెమోలిస్తానంటూ హెచ్చరించి నట్టు సమాచారం. తప్పు చేయని స్టాఫ్ నర్సులకు మెమోలివ్వలేక, డెరైక్టరు మాటకు ఎదురు చెప్పలేక ఓ నర్సింగ్ సూపరింటెండెంట్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిసింది.
 
 ఆందోళన ఆలోచనలో నర్సింగ్ స్టాఫ్ !
 డెరైక్టర్ తీరు మార్చుకోకపోతే ఆందోళనకు సిద్ధం కావాలననే ఆలోచనలో స్టాఫ్ నర్సులు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు కొంతమంది గురువారం సమావేశమై చర్చించినట్టు ఆస్పత్రి వ ర్గాలు చెబుతున్నాయి. నిజంగా తప్పు చేసి ఉంటే ఆధారాలతో సహా రుజువు చేసి చర్య తీసుకోవాలంటున్నారు.  
 
 మెమోలివ్వమన్న మాట వాస్తవమే
 విధులు సక్రమంగా నిర్వహించటం లేదంటూ కొంత మంది స్టాఫ్ నర్సుల కు మెమోలను ఇవ్వమని డెరైక్టర్ చెప్పటం వాస్తవమేనని గ్రేడ్-2 నర్సిం గ్ సూపరింటెండెంట్ దుర్గాంబ ‘సాక్షి’కి చెప్పారు. తొలుత మెమోలు ఇవ్వమని చెప్పినా.. ఆ తరువాత వాటిని రద్దు చేయమని చెప్పడంతో ప్రస్తుతం ఎవ్వరికి మెమోలు ఇవ్వలేదన్నారు. ఇదే విషయాన్ని రిమ్స్ సూపరింటెండెంట్ ఎల్.వేణుగోపాల్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా నర్సింగ్ స్టాఫ్ చాలా సమయం ఒకే చోటకూర్చొని ఉంటున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో స్టాఫ్ నర్సులను డెరైక్టరు మందలించినట్టు చెప్పారు. మెమోల విషయం తనకు తెలియదన్నారు.
 

>
మరిన్ని వార్తలు