రాధాకృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం

15 Jul, 2016 00:50 IST|Sakshi

పోలీసుల అదుపులో బాబాయి, అబ్బాయి, మేనమామ
 
 
వీరులపాడు : తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కక్షతో మెండెం రాధాకృష్ణ(35)ను గ్రామానికి చెందిన కామాల యాకోబు, అతని బాబాయి కామాల జమలయ్యతో కలిసి హత్య చేసినట్లు నందిగామ డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. హత్యకు పాల్పడిన ఇరువురితో పాటు వారికి ఆశ్రయమిచ్చిన యాకోబు మేనమామ దాసరి చెన్నకేశవరావును  అదుపులోకి తీసుకుని గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన మెండెం రాధాకృష్ణ ఈ నెల 7న గ్రామంలోని మద్యం దుకాణం సమీపంలోని ఆర్‌అండ్‌బీ రహదారి పక్కనున్న పంట బోదెలో శవమై కనిపించాడు.


మృతుని తల్లి వెంకట్రావమ్మ తన కుమారుడిని హత్య చేశారని  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నందిగామ రూరల్ సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. రాధాకృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతుని శరీరంపై గాయాలుండడమే కాక ఊపిరి ఆడక మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దీంతో మృతుని తల్లి ఇచ్చిన అనుమానితుల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టగా యాకోబు, తన బాబాయి జమలయ్యతో కలిసి హత్య చేసినట్లు తేలింది. నిందితులను విచారించగా తల్లితో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే కక్షతో తన బాబాయితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
 
దొరికిపోయారు ఇలా..
ఈనెల 7న రాత్రి సమయంలో రాధాకృష్ణ మద్యం దుకా ణం సమీపంలో ఉండడాన్ని గమనించిన యాకోబు, జమలయ్యలు గొంతు నులమడంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. రాధాకృష్ణను హత్య చేసి మృతదేహాన్ని రహదారి పక్కనున్న పంట బోదెలో పడేసి ఇబ్రహీం పట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన యాకోబు మేనమామ దాసరి చెన్నకేశవరావు ఇంటికి నిందితులు వెళ్లారు. వీరు ముగ్గురు కలిసి విజయవాడ పరి సర ప్రాంతాల్లో ఉన్నారు. వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో గురువారం ఉదయం 7 గంటల సమయంలో కంచికచర్ల బస్టాండ్‌కు చేరుకున్నారు. వీరు బస్టాం డ్ సమీపంలో సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో సీఐ సత్యకిషోర్ సిబ్బందితో వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు.  ఎస్‌ఐ అవినాష్, ట్రైనీ ఎస్‌ఐ ప్రియకుమార్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 

>
మరిన్ని వార్తలు