ఐటీ డిపార్ట్మెంట్కు సీబీడీటీ ఆదేశాలు
న్యూఢిల్లీ: రూ.5,000 లోపు ఉన్న పన్ను రిఫండ్స్ను వీలైనంత త్వరగా అసెస్సీలకు పంపించాలని సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది. గత మూడు అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి రూ.5,000 లోపు పన్ను రిఫండ్స్ను క్లియర్ చేయాలని ఆదాయపు పన్ను విభాగాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్) ఆదేశించింది. 2013-14, 2014-15, 2015-16.. ఈ మూడు అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి తనిఖీ కోసం స్వీకరించని రూ.5,000 లోపు పెండింగ్ ట్యాక్స్ రిఫండ్స్ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీలైనంత త్వరగా సదరు అసెస్సీలకు పంపించేయాలని సీబీడీటీ పేర్కొంది.
ఇలా తనిఖీ కోసం స్వీకరించని రూ.5,000 లోపు ట్యాక్స్ రిఫండ్లు ఈ మూడు ఆర్థిక సంవత్సరాలకు కలుపుకొని భారీ సంఖ్యలో ఉన్నాయని సమాచారం. చిన్న పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీబీడీటీ వివరించింది. ఒకవేళ ఏదైనా పన్ను చెల్లింపుదారుడి నుంచి పన్ను లు రావలసి ఉండి, సదరు అసెస్సీకి గత మూడు సంవత్సరాల్లో ట్యాక్స్ రిఫండ్ ఉన్న పక్షంలో, ఈ ట్యాక్స్ రిఫండ్ను పూర్తిగా కానీ, కొంత మొత్తంలో కాని ఆదాయపు పన్ను అధికారులు భర్తీ చేసుకోవచ్చని సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది.