గతేడాదితో పోల్చితే రూ.66 కోట్లు అధికం
టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో పాలకమండలి సమావేశం
పలు నిర్ణయాలకు ఆమోదం
తిరుమల: 2020–21 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం బడ్జెట్కు ఆమోదం తెలిపింది. సమావేశంలో పలు అభివృద్ధి పనులు, ఆలయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. బడ్జెట్లో ముఖ్యంగా హిందూ ధర్మప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్మాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్ రూ.66 కోట్లకు పైగా పెరిగింది. ఈ కార్యక్రమంలో.. ఈవో అనిల్కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి ఎక్స్ అఫీషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర్రెడ్డి, శేఖర్రెడ్డి పాల్గొన్నారు. కాగా, శ్రీ శార్వరి నామ సంవత్సర తెలుగు పంచాంగం శనివారం నుంచి తిరుమల, తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంది. మార్చి మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీటీడీ కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది.
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో ఈవో సింఘాల్, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, బోర్డు సభ్యులు
పాలకమండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
- తిరుమలలోని బూందీ పోటులో అగ్నిప్రమాదాల నివారణ కోసం రూ.3.30 కోట్లతో అధునాతన థర్మోఫ్లూయిడ్ కడాయిలు ఏర్పాటుకు ఆమోదం.
- జూపార్కు సమీపంలో రూ.14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ హాస్టల్ భవనం, రూ.34 కోట్లతో ఎస్వీ బధిర పాఠశాల హాస్టల్ భవనాల నిర్మాణానికి ఆమోదం.
- అలిపిరి – చెర్లోపల్లి రోడ్డు విస్తరణలో మిగిలి ఉన్న పనులను రూ.16 కోట్లతో పూర్తి చేసేందుకు ఆమోదం.
- బర్డ్ ఆస్పత్రి నూతన ఓపీ భవనంలో అదనపు ఆపరేషన్ థియేటర్ల నిర్మాణానికి రూ.8.43 కోట్లు మంజూరు.
- చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను నటరాజన్ కన్స్ట్రక్షన్ సంస్థకు రూ.3.92 కోట్లతో టెండరు ద్వారా అప్పగించేందుకు ఆమోదం.
- రూ.4 కోట్లతో హైదరాబాద్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, పుష్కరిణి, వాహన మండపం,కల్యాణోత్సవ మండపం, తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ఆమోదం.
- టీటీడీ నిఘా, భద్రతా విభాగంలో ఖాళీగా ఉన్న 300 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం.
- అలిపిరి చెక్పాయింట్ వద్ద టోల్గేట్లో జాతీయ రహదారుల సంస్థ నిర్దేశించిన మేరకు వాహనాల విభజన చేపట్టి ఫాస్టాగ్ అమలు చేయాలని, టోలు రుసుం పెంచాలని నిర్ణయం. ద్విచక్ర వాహనాలకు టోలు రుసుం మినహాయింపు.
- ఇన్ఫోసిస్ సహకారంతో టీటీడీలో సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేకాధికారిని నియమించాలని నిర్ణయం.
- జమ్మూ, వారణాసి, ముంబైలలో త్వరలో శ్రీవారి ఆలయాల నిర్మాణం.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సాయి వెంకట సుబ్రహ్మణ్యం రూ.10 లక్షలు, విజయవాడ కానూరుకు చెందిన యార్లగడ్డ వెంకట్రావు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.