ఎన్‌ఆర్సీకి తాము వ్యతిరేకం: సీఎం జగన్‌

23 Dec, 2019 17:10 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: దేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ) అమలుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్‌ఆర్సీకి వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం ప్రకటించారు. మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా సోమవారం కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్‌.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఆర్సీ బిల్లు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ప్రభుత్వం తరుఫునే గతంలో వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రకటనకు కట్టుబడి ఉంటామని సీఎం స్పష్టం చేశారు. కాగా వివాదాస్పద ఎన్‌ఆర్సీపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం, మైనార్టీలకు తాము అండగా ఉంటామని, ఏమాత్రం ఆందోళనకు గురికాద్దని డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు