90 నిముషాల్లో ఫోన్‌ డెలివరీ

24 Dec, 2019 00:59 IST|Sakshi
ఆఫర్లను ప్రకటిస్తున్న బాలాజీ రెడ్డి, కైలాష్‌ లఖ్యానీ, బాలు చౌదరి, స్వప్న కుమార్‌ (ఎడమ నుంచి)

ఆన్‌లైన్‌లోకి ‘బిగ్‌ సి’ మొబైల్స్‌

స్మార్ట్‌ ఉపకరణాలూ విక్రయం

కంపెనీ ఫౌండర్‌ బాలు చౌదరి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ ఆన్‌లైన్‌ విక్రయాల్లోకి ప్రవేశించింది. కంపెనీ స్టోర్లున్న నగరం, పట్టణంలో వెబ్, యాప్‌ ద్వారా ఆర్డరు ఇచ్చిన 90 నిమిషాల్లోనే మొబైల్‌ను ఉచితంగా డెలివరీ చేస్తారు. కస్టమర్‌ కోరితే ఇంటి వద్దే మొబైల్స్‌ను ప్రదర్శిస్తారు. ప్రస్తుతం సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 81 నగరాలు, పట్టణాల్లో 225 ఔట్‌లెట్లు ఉన్నాయి. కర్ణాటకలో కొద్ది రోజుల్లో అడుగు పెట్టనున్నట్టు బిగ్‌ సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు. 17వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించిన సందర్భంగా డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, కైలాష్‌ లఖ్యానీతో కలిసి సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 2021 మార్చి నాటికి స్టోర్ల సంఖ్య 300లకు చేరుతుందన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లదాకా ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

స్టోర్లలో ఇతర ఉపకరణాలు..
మొబైల్స్, యాక్సెసరీస్‌తోపాటు ఎంఐ, టీసీఎల్‌ కంపెనీల స్మార్ట్‌ టీవీల విక్రయాలను ప్రారంభించామని బాలు చౌదరి తెలిపారు. ‘ఇతర కంపెనీల స్మార్ట్‌ టీవీలను సైతం ప్రవేశపెడతాం. ఇంటర్నెట్‌తో అనుసంధానించే స్మార్ట్‌ ఉపకరణాల సంఖ్య పెంచుతాం. 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని రూ.12 కోట్ల విలువైన బహుమతులు, రూ.5 కోట్ల విలువైన క్యాష్‌ పాయింట్లను సైతం ఆఫర్‌ చేస్తున్నాం. ప్రతి కొనుగోలుపై స్క్రాచ్‌ కార్డు ద్వారా ఖచ్చితమైన బహుమతిని కస్టమర్‌ అందుకోవచ్చు. ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి బహుమతులు వీటిలో ఉన్నాయి. జనవరి 31 వరకు ఈ ఆఫర్‌ ఉంటుంది’ అని వివరించారు. 5 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
 

మరిన్ని వార్తలు