29 వస్తువులపై జీరో జీఎస్టీ 

18 Jan, 2018 19:41 IST|Sakshi

న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్‌ 25వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 53 వస్తువులపై రేట్లను తగ్గించినట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వీటిలో ముఖ్యంగా హస్తకళల వస్తువులున్నట్టు పేర్కొన్నారు. 29 రకాల హస్తకళ వస్తువులను 0% శ్లాబులోకి తెచ్చామని, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రేట్లను తగ్గించినట్టు ప్రకటించారు. మార్పులు చేసిన జీఎస్టీ రేట్లను జనవరి 25 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ సమావేశం నిర్వహించింది.

అంతేకాక ఈ సమావేశంలో రిటర్న్స్‌, ఫైలింగ్‌ ప్రక్రియను సులభతరం చేసే అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ-వే బిల్లు ఫిబ్రవరి 1 నుంచి కచ్చితంగా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే నేడు నిర్వహించిన ఈ సమావేశంలో కీలక అంశమైన పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చించలేదు. బీడీలపై జీఎస్టీ తగ్గించాలని కోరినా.. కౌన్సిల్‌ ఆమోదించలేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ వస్తువులపై మాత్రం జీఎస్టీ 18 శాతం నుంచి 12 శాతం తగ్గింపుకు ఆమోదం లభించిందన్నారు. 

>
మరిన్ని వార్తలు