ఎస్‌బీఐ బాటలో బీఓబీ, యూబీఐ

31 Mar, 2020 06:19 IST|Sakshi

రుణాలపై 0.75% వడ్డీరేటు కోత

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోను 0.75 బేసిస్‌ పాయింట్లు (రెపో ప్రస్తుతం 4.4 శాతం) తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనం మొత్తాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లు కస్టమర్లకు బదలాయించాయి. రెపో ఆధారిత రుణ రేటు తగ్గింపు మార్చి 28వ తేదీ నుంచీ అమల్లోకి తెస్తున్నట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో రెపోకు అనుసంధానమయ్యే వ్యక్తిగత రిటైల్, కార్పొరేట్, చిన్నతరహా పరిశ్రమల రుణ రేట్లు 0.75 శాతం మేర తగ్గనున్నాయి. ఇక తమ తగ్గింపు రేట్లు బుధవారం నుంచీ అమల్లోకి వస్తాయని యూబీఐ పేర్కొంది. యూనియన్‌ బ్యాంక్‌లో విలీనమవుతున్న ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌లకూ తగ్గించిన వడ్డీరేట్లు అమలవుతాయని తెలిపింది.

పీఎన్‌బీ కొత్త లోగో:  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కొత్త లోగోను ఆవిష్కరించింది. పీఎన్‌బీలో ఏప్రిల్‌ 1 నుంచి యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ విలీనం అవుతున్న సంగతి తెలిసిందే.

సుజ్లాన్‌ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్‌బీఐ ఓకే
టర్బైన్ల తయారీ సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్‌బీఐ సమ్మతి తెలిపింది. 18 బ్యాంకుల కన్సార్షియంకు ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంకర్‌గా వ్యవహరిస్తోంది. సుజ్లాన్‌లో 10% వాటాను భాగస్వామ్య బ్యాంకులు తీసుకోనున్నాయి. బ్యాంకులకు సుజ్లాన్‌ రూ.12,785 కోట్లు బాకీ పడింది.

 

మరిన్ని వార్తలు