మైక్రోఫైనాన్స్‌ రుణాల్లో 43% వృద్ధి 

26 Feb, 2019 00:24 IST|Sakshi

క్యూ3లో రూ. 1.66 లక్షల కోట్లకు మొత్తం లోన్‌ పోర్ట్‌ఫోలియో 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో మైక్రోఫైనాన్స్‌ రంగం రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 1,66,284 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 43.1 శాతం వృద్ధి నమోదు చేసింది. మైక్రోఫైనాన్స్‌ సంస్థల నెట్‌వర్క్‌ ఎంఎఫ్‌ఐఎన్‌ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం మైక్రోఫైనాన్స్‌ ఖాతాలు వార్షిక ప్రాతిపదికన 24.3 శాతం పెరిగి 8.91 కోట్లకు చేరాయి. మైక్రో ఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోలో బ్యాంక్‌యేతర ఆర్థిక సంస్థల కోవకి చెందిన సూక్ష్మ రుణాల సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐ) వాటా రూ. 60,631 కోట్లు(36.5%). ‘మైక్రోఫైనాన్స్‌ సంస్థలు జరిపే రుణాల వితరణలో సుమారు 81% లావాదేవీలు నగదు రహిత విధానంలోనివే. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలైతే ఏకంగా 100 శాతం నగదురహిత విధానంలో రుణాల వితరణ నమోదు చేశాయి‘ అని ఎంఎఫ్‌ఐఎన్‌ సీఈవో హర్‌‡్ష శ్రీవాస్తవ తెలిపారు. 50 ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలు అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్యకాలంలో 77 లక్షల ఖాతాదారులకు రూ. 19,199 కో ట్ల రుణాలు మంజూరు చేశాయి.  రూ.8,235 కోట్లు సమీకరించాయి.  

అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో .. 
తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐల రుణాల పోర్ట్‌ఫోలియో అత్యధికంగా కేంద్రీకృతమై ఉంది. ఇక దక్షిణాది వాటా 25 శాతం కాగా, ఉత్తరాది 14%, పశ్చిమ రాష్ట్రాలు 15%, మధ్య భారతంలో 9%గా ఉంది. మొత్తం సూక్ష్మ రుణాల రంగంలో ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐల వాటా 36.5%, బ్యాంకులది 32.2%, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులది 18.2%, ఎన్‌బీఎఫ్‌సీలది 10.7%, ఎంఎఫ్‌ఐల వాటా 2.4%గా ఉంది. 

మరిన్ని వార్తలు