ద్రవ్యోల్బణానికి, టెలికాం షాక్‌

5 Dec, 2019 20:15 IST|Sakshi

ఇన్‌ఫ్లేషన్‌పై ఆర్‌బీఐ గవర్నర్‌ అంచనాలు

ద్రవ్యోల్బణం మరింత దిగజారే అవకాశం - శక్తికాంత దాస్‌

సాక్షి,ముంబై: భారత  కేంద్ర  బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనూహ్యంగా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం పలువురి ఆర్థికవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ గురువారం ముంబైలో మాట్లాడుతూ టెలికాం చార్జీలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ రేటు మరింత పెరిగే అవకాశముందని అన్నారు. ద్రవ్యల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ రెపోరేటును(5.15) మార్చలేదని, కానీ భవిష్యత్తులో అధిక ద్రవ్యోల్బణ రేటు, ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రధానంగా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం ఆహార ద్రవ్యోల్బణం అని ఆయన స్పష్టం చేశారు. 

ముఖ్యంగా నాలుగో క్వార్టర్‌లో(జనవరి-మార్చి) ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ ఏడాది క్యూ2లో 4 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం మరింత క్షీణిస్తుందని అంచనావేశారు. వచ్చే ఏడాది క్యూ2 నాటికి 3.8 శాతంగా ఉండవచ్చని పేర్కొన్నారు.  మరోవైపు మూడు ప్రయివేటు టెలికాం కంపెనీలు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్, జియోలు తమ టారీఫ్‌ ప్లాన్‌లు, ప్రీ-పెయిడ్ టారిఫ్ ప్లాన్‌లను 40-50 శాతం పెంచాయని అన్నారు. మూడేళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో చార్జీలు పెరిగాయని అన్నారు. ప్రస్తుతం టెలికాం రంగం ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రస్తుతం ఏడీఆర్‌కు (సవరించిన స్థూల ఆదాయం) సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉందని అన్నారు. కాగా వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సవరించిన రేట్లు  ఇప్పటికే అమల్లోకి రాగా జియో రేట్లు మాత్రం శుక్రవారం నుండి అమలులోకి రానున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు