సెబీకి మరిన్ని అధికారాలు: కేంద్ర క్యాబినెట్ ఆమోదం

18 Jul, 2013 06:00 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మరిన్ని అధికారాలను కల్పించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. తద్వారా పొంజీ స్కీములు, ఇన్వెస్టర్లు మోసం చేస్తూ అవకతవకలకు పాల్పడేవారికి చెక్ పెట్టే బాటలో సెబీ చట్టానికి సవరణలను చేపట్టనుంది. ఈ ప్రతిపాదనలు కార్యరూపందాలిస్తే సంబంధిత కేసుల విషయంలో సెబీ... పోన్ కాల్ డేటా రికార్డులను పొందడం, తనిఖీ చేపట్టడం, కార్యకలాపాలను నిలిపివేయడం, ఆస్తులను అటాచ్ చేయడం వంటి అధికారాలను పొందేందుకు వీలు చిక్కుతుంది.

ఈ విషయంలో సెబీతో విస్తృత చర్చలను చేపట్టడం ద్వారా తుది నిబంధనలను ఖరారు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సెక్యూరిటీల మార్కెట్లలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పూర్తిస్థాయిలో నిబంధనలను హేతుబద్ధీకరించడం లేదా సవరించడం చేయమంటూ సెబీ చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది. ప్రధానంగా కొత్త మార్గాలలో ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై తగిన చర్యలను చేపట్టేందుకు వీలుగా నిబంధనలను పటిష్టపరచమంటూ కోరుతోంది.

ప్రస్తుతం సెబీ తనిఖీలు, ఆస్తుల జప్తు వంటివి చేపట్టేందుకు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అనుమతిని పొందాల్సి ఉంటోంది. కాగా, తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై రూ. 100 కోట్లకుపైగా సమీకరించే కలెక్టివ్ స్కీమ్‌లకు సంబంధించి కూడా సెబీకి ప్రత్యేక అధికారాలు దాఖలుకానున్నాయి. ఈ ప్రతిపాదనలపై సలహాల కోసం ఆర్థిక వ్యవహారాల శాఖ, దేశీ వ్యవహారాలు, న్యాయ, టెలికం తదితర శాఖలతోపాటు, రిజర్వ్ బ్యాంకు, ప్రణాళికా సంఘం, ప్రధాని కార్యాలయాలకు క్యాబినెట్ నోట్‌ను పంపారు.

>
మరిన్ని వార్తలు