ఎన్‌ఎస్‌ఈఎల్‌–ఎఫ్‌టీఐఎల్‌  విలీనం చెల్లదు! 

1 May, 2019 00:32 IST|Sakshi

సుప్రీంకోర్టు కీలక రూలింగ్‌

బాంబే హైకోర్టు తీర్పు కొట్టివేత 

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ ఇండియా  (ఎఫ్‌టీఐఎల్‌) నేషనల్‌ స్పాట్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈఎల్‌)ను విలీనం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం ఎఫ్‌టీఐఎల్‌ పేరు  63 మూన్‌ టెక్నాలజీస్‌గా మారింది. 2016 ఫిబ్రవరి 12న కేంద్రం తీసుకున్న  విలీన నిర్ణయాన్ని సమ ర్థిస్తూ, 2017 డిసెంబర్‌లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును 63 మూన్‌ టెక్నాలజీస్‌ సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తాజా రూలింగ్‌ ఇచ్చింది. కంపెనీల చట్టంలోని 396వ సెక్షన్‌నూ అలాగే రాజ్యాంగంలోని 14వ అధికరణనూ (చట్టం ముందు అందరూ సమానులే) కేంద్రం నిర్ణయం ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

విలీన నిర్ణయ తీరు ఇదీ...
ఎన్‌ఎస్‌ఈఎల్‌కు జిగ్నేష్‌ షా ప్రమోట్‌ చేస్తున్న ఎఫ్‌టీఐఎల్‌ పేరెంట్‌ కంపెనీ. ఎన్‌ఎస్‌ఈఎల్‌లో 99% వాటా ఎఫ్‌టీఐఎల్‌కు ఉంది. దాదాపు 13,000 ఇన్వెస్టర్లకు రూ.5,600 కోట్ల మేర చెల్లించాల్సి ఉండి విఫలం కావటంతో 2013లో ఎస్‌ఎస్‌ఈఎల్‌ మూతబడింది. ఈ సంక్షోభం నేపథ్యంలో 1956 కంపెనీల చట్టంలోని 396 సెక్షన్‌ కింద ఎఫ్‌టీఐఎల్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్‌ విలీనానికి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ  2016 ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంది.

న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం 
మాకు ఎప్పుడూ భారత న్యాయవ్యవస్థ, మన కోర్టుల పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. చివరకు నిజమే నిలబడింది 
– జిగ్నేష్‌ షా, చైర్మన్‌ 63 మూన్స్‌ టెక్నాలజీస్‌ 

 

>
మరిన్ని వార్తలు