జియో హాట్రిక్ : మరో మెగా డీల్

8 May, 2020 11:16 IST|Sakshi
ఫైల్ ఫోటో

జియోలో  మరో భారీ పెట్టుబడులు 

అమెరికాకు చెందిన విస్టా కంపెనీ  2.32 శాతం వాటా  కొనుగోలుకు సిద్ధం

మూడు వారాల్లో మొత్తం రూ. 60,596 కోట్ల  పెట్టుబడులు

సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్  యాజమాన్యంలోని  రిలయన్స్ జియో విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్,  ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాలతో జోరుమీదున్న జియో తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్‌ కంపెనీతో మరో మెగా ఒప్పందానికి సన్నద్ధమైంది. ఈ ఒప్పందం ద్వారా ఆర్ఐఎల్‌కు రూ.11,367 కోట్లు సమకూరనున్నాయి. ఈ ఒప్పందంలో ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లు అని రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫామ్‌లు  శుక్రవారం ప్రకటించాయి. దీంతో విస్టా జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా నిలిచింది. కేవలం రెండు వారాల్లోనే అమెరికాకి చెందిన మరో కంపెనీ జియోలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం విశేషం.

తమ ఇతర భాగస్వాముల మాదిరిగానే, విస్టా కూడా భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ద్వారా భారతీయులందరికీ  ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో తమతో జత కట్టిందని ఆర్ఐఎల్  ఛైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తాజా పెట్టుబడులతో ప్రముఖ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ .60,596.37 కోట్లు పెట్టుబడులను మూడు వారాల్లో సేకరించగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్  ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్ లో రిలయన్స్ 3 శాతానికి పైగా ఎగిసింది.  (జియో మరో భారీ డీల్ )

కాగా ఏప్రిల్ 22 న జియో‌లో 9.99 శాతం వాటా కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫేస్‌బుక్‌తో 43,574 కోట్ల రూపాయల ఒప్పందాన్ని, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ నుంచి రూ .5,656 కోట్ల పెట్టుబడిని సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ సారథ్యంలోని ఆర్ఐఎల్ మార్చి 2020 నాటికి రూ.1.61 లక్షల కోట్ల అప్పుతో ఉన్న కంపెనీ 2021 నాటికి రుణ రహిత సంస్థగా అవతరించే లక్ష్య సాధనలో సమీప దూరంలో నిలిచింది.

చదవండి : జియో మరో సంచలనం, ప్రత్యర్థులకు షాక్

మరిన్ని వార్తలు