అంచనాలు బీట్‌ చేయలేకపోయిన విప్రో

25 Apr, 2018 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ : టెక్‌ దిగ్గజం విప్రో స్ట్రీట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఏడాది ఏడాదికి కన్సాలిడేట్‌ నికర లాభాల్లో విప్రో 21 శాతం క్షీణించింది. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్‌ ఫలితాల్లో విప్రో నికర లాభం రూ.1,800.80 కోట్లగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో విప్రో లాభం రూ.2,267 కోట్లు. ఈటీనౌ పోల్‌ అంచనాల్లో విప్రో రూ.2,140 కోట్లు ఆర్జిస్తుందని అంచనావేశారు. కానీ ఈ అంచనాలను కూడా విప్రో అందుకోలేకపోయింది. సీక్వెన్షియల్‌ బేసిస్‌లో కంపెనీ లాభాలు 6.7 శాతం పడిపోయాయి. ఆపరేషన్స్‌ నుంచి వచ్చిన రెవెన్యూలు ఈ క్వార్టర్‌లో రూ.13,768.6 కోట్లగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఇది రూ.13,987.5 కోట్లుగా రికార్డయ్యాయి. 

ఒక్కో షేరుపై వచ్చిన రెవెన్యూలు 4 రూపాయలుగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. విప్రో ఎయిర్‌పోర్ట్‌ ఐటీ సర్వీసుల్లో కంపెనీ ఈక్విటీ హోల్డింగ్‌ 74 శాతం నుంచి 11 శాతానికి తగ్గించుకున్నట్టు పేర్కొంది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.14,304.6 కోట్లగా ఉన్నట్టు వెల్లడించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.15,045.5 కోట్లగా ఉంది. మొత్తంగా ఇవి అంత మంచి ఫలితాలు కావని, కొన్ని కారణాల వల్ల తమ ఫలితాలపై ప్రభావం చూపుతుందని అంతకమందే కంపెనీ సంకేతాలు ఇచ్చిన స్వతంత్ర మార్కెట్‌ విశ్లేషకుడు పంకజ్‌ శర్మ చెప్పారు. కానీ ఆ సవాళ్లను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఇవి అంతమంచి ఫలితాలు కావని పేర్కొన్నారు. రేపు విప్రో స్టాక్‌ కరెక్షన్‌ గురయ్యే అవకాశముందని, కనీసం 2 శాతం నుంచి 4 శాతం కిందకి పడిపోతుందని శర్మ అంచనావేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు