ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది దుర్మరణం

1 Oct, 2019 08:20 IST|Sakshi

గుజరాత్‌లో రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి

దైవదర్శనానంతరం మృత్యుకౌగిలికి..

అహ్మదాబాద్‌: దేవున్ని దర్శించుకొని, ఇంటికి తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు కాటేసింది. వర్షం కారణంగా గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో  ప్రైవేటు సూపర్‌ లగ్జరీ బస్సు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 21 మంది మృతి చెందగా, 53 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ సందీప్‌ సగాలే, ఎస్పీ రజియన్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సహాయంతో బస్సును వెలికి తీసి బాధితులను పాలంపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 53 మందిలో 35 మంది పరిస్థితి విషమంగా ఉందని కలెక్టర్‌ తెలిపారు. బాధితులకు చికిత్స అందించడానికి, పోస్ట్‌మార్టం కోసం వేరే చోట్ల నుంచి వైద్యులను రప్పించినట్లు తెలిపారు. బాధితులంతా ఆనంద్‌ తాలూకాలోని అంక్లావ్‌ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అంబాజీ దేవాలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. గత జూలైలో ఇదే స్థలంలో ఓ వాహనం బోల్తాపడి తొమ్మిది మంది మరణించారు. 

మరోవైపు ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని స్పందించారు.  తక్షణమే సంబంధిత చ ర్యలు చేపట్టాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు  కోలుకోవాలని ప్రార్థిస్తూ మోదీ ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తలు